కరోనా కట్టడికి పలు గ్రామాలు
ఓవైపు పోలీసుల అవగాహన.. మరోవైపు స్వచ్ఛందంగా దుకాణాలు బంద్
కట్టడిలో అప్రమత్తమవుతున్న ప్రజలు
గద్వాల, మే 8 : కరోనా రోజురోజుకూ విస్తరిస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు మినీ లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్నాయి. స్వీయ నిర్బంధం ప్రజలే ఏర్పాటు చేసుకుంటున్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావాలని సూచిస్తూ ఆంక్షలు విధించుకుంటున్నారు. జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుండడంతో ఎవరికి వారే వైరస్ కట్టడికి ముందుకొస్తున్నారు. మండల కేంద్రాలు, గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుని లాక్డౌన్పై చర్చించుకుంటున్నారు. ఇలా ఎవరికి వారే లాక్డౌన్ విధించుకుంటుండడంతో కొంత మేర అయినా కట్టడి చేయగలమనే నమ్మకం ప్రజల్లో కనిపిస్తున్నది. రాత్రి కర్ఫ్యూ కూడా మంచి ఫలితాలను ఇస్తుందని చెప్పొచ్చు. రాత్రి 8 గంటలు దాటిందంటే పోలీసులు రోడ్లపైకి వచ్చి ప్రజలు తిరగకుండా కట్టు దిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కర్ఫ్యూను జిల్లా ఎస్పీ రంజన్త్రన్కుమార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలో కర్ఫ్యూ ఏ విధంగా అమలవుతుందో పర్యవేక్షించడానికి స్వయంగా పట్టణంలో పర్యటిస్తున్నారు. ప్రజలకు పోలీసులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. వారికి తోడుగా వ్యాపారస్తులు నిలుస్తున్నారు. ఇప్పటికే గట్టు, మల్దకల్, అయిజ, కేటీదొడ్డి మండలం నందిన్నెలో వ్యాపారస్తులు స్వయంగా ముందుకొచ్చి మధ్యాహ్నం నుంచి దుకాణాలు స్వచ్ఛందగా మూసివేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో కిరాణం మర్చంట్ అసోసియేషన్, బంగారు దుకాణాలు సాయంత్రం 5 గంటల వరకే బంద్ చేస్తున్నారు. బట్టల దుకాణదారులు కూడా సాయంత్రం వరకే తమ దుకాణాలను మూసి వేస్తున్నారు. అయిజ, గట్టు, మల్దకల్ తదితర ప్రాంతాల్లో సంతలు కూడా మధ్యాహ్నం వరకే జరిగేలా తీర్మానం చేసి బంద్ చేస్తున్నారు. సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ముందు ఉండే డాక్యుమెంట్ రైటర్లు శనివారం నుంచి వారం పాటు తమ సేవలు నిలిపివేయనున్నారు. గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటు చేసి లాక్డౌన్ నిర్ణయాలు తీసుకుంటుండంతో ప్రజలు అప్రమత్తమవుతున్నారు. జిల్లాలో ఇప్పటికే కొన్ని దేవాలయాలు బంద్ చేయగా శనివారం మల్దకల్ ఆలయంలో జరిగే ఆర్జిత సేవలతో పాటు పల్లకీసేవను నిలిపివేశారు. అలాగే ధరూర్ మండలం చింతరేవుల ఆలయాన్ని మూసి వేశారు. వడ్డేపల్లి మండల కేంద్రంలో పురపాలక చైర్మన్ కరుణ ఇంటింటికీ వెళ్లి కరోనా వ్యాప్తిని అరికట్టడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరిస్తున్నారు. ఇలా ఎవరి పరిధిలో వారు కరోనా కట్టడికి కృషి చేస్తున్నారు. స్వచ్ఛందంగా దుకాణాలు బంద్ పాటిస్తుండడంతో కొంత మేర అయిన వైరస్ కట్టడి జరిగే అవకాశం ఉన్నది.
నందిన్నెలో..
కేటీదొడ్డి, మే 8 : కేటీదొడ్డి మండలంలోనే పెద్ద పం చాయతీ అయిన నందిన్నె గ్రామంలో కరోనా కట్టడి కోసం శనివారం నుంచి సంపూర్ణ లాక్డౌన్ విధించారు. గ్రామం సుమారు 15 గ్రామాలకు దగ్గరగా ఉండటంతో సుమారు వేల సంఖ్యలో వ్యాపార లావాదేవీలకు నిత్యం వస్తుంటారు. గ్రామంలో ప్రతి శుక్రవారం సంతతో పట్టణాన్ని తలపి స్తుంది. ఈ నేపథ్యంలో వైరస్ కట్టడికి గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. మినీ లాక్డౌన్ కొనసాగిస్తున్నట్లు సర్పం చ్ చిన్న భీమ రాయుడు తెలిపారు. నిత్యావసర సరుకుల కోసం ఉదయం 5 గంటల నుంచి 12 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంటాయన్నారు.