అమ్మాయేనా! అనే దగ్గర్నుంచి.. మా అమ్మాయి అని సగర్వంగా చెప్పుకొనే రోజులివి. కొడుకుతో సమానంగా కూతుర్ని పెంచుతూ, అవకాశాలు పంచుతున్నది నేటితరం. వంటిల్లే కాదు..సమాజాన్ని చక్కబెడుతూ అన్నిరంగాల్లోనూ సత్తా చాటుతోంది. శుక్రవారం సైబరాబాద్, హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మాదాపూర్ టెక్ మహీ ంద్రా, బేగంపేట ఎయిర్పోర్టు ఆడిటోరియంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన అతివలకు అవార్డులు ప్రదానం చేశారు. హైదరాబాద్ అత్యంత సురక్షిత నగరమని, మహిళల భద్రత కోసం షీటీమ్స్, షీషటిల్తోపాటు షీ సేఫ్ యాప్ తీసుకొచ్చినట్లు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, సజ్జనార్ తెలిపారు.
మాదాపూర్ : నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీసులు సరికొత్త వ్యూహాలతో ముందుకు సాగుతున్నారని, మహిళలు అన్ని రంగాల్లో పోటీపడి సత్తా చాటాలని సైబరాబాద్ సీపీ సజ్జనార్ , నేషనల్ చీఫ్ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మాదాపూర్లోని టెక్ మహీంద్రాలో సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ (ఎస్సీఎస్సీ) ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఆయా రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మహిళలకు అవార్డులను ప్రదానం చేసి సత్కరించారు. అనంతరం మహిళల భద్రతను మరింత పటిష్ట పరిచేందుకు షీ సేఫ్ పేరుతో రూపొందించిన యాప్ను ఆవిష్కరించారు.
అనంతరం పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ.. కొవిడ్ సమయాల్లో విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా తెలంగాణ పోలీసులు సేవలను అందించి.. దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులపై పోలీస్ యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించిందని, గచ్చిబౌలి స్టేషన్ పరిధిలో ట్రాన్స్జెండర్ హెల్ప్ డెస్క్ను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
తొమ్మిది సంవత్సరాల క్రితం వాహనంపై వెళ్తుండగా ట్రక్ ఢీ కొనడంతో చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చిందని బ్యాడ్మింటన్ మాన్సి జోషి అన్నారు. ఈ ప్రమాదంతో బ్యాడ్మింటన్గా రాణించాలనుకునే తన కళ వృథా అవుతుందేమోనని బాధపడ్డాను..కానీ.. స్నేహితులు, తోటి క్రీడాకారులు ప్రోత్సహించడంతో తిరిగి తక్కువ రోజుల్లోనే కోలుకొని బ్యాడ్మింటన్లో రాణించడం సంతోషంగా ఉందన్నారు. 2015లో మొదటి సారిగా ఇంటర్నేషనల్ టోర్నమెంట్లో ఆడానని, 2019లో చాంపియన్షిప్కు ఎంపికయ్యాను… ఇది తన జీవితంలో మరిచిపోలేనిదని అన్నారు. ట్రాన్స్జెండర్ల భద్రతను దృష్టిలో ఉంచుకొని హెల్ప్డెస్క్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, మహిళల భద్రతపై ఎస్సీఎస్సీ, షీ టీంలు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు.
అమ్మ లేనిదే ప్రపంచం లేదు .. మహిళలు అన్ని చోట్ల గౌరవించబడాలి అని సైబరాబాద్ సీపీ సజ్జనార్ అన్నారు. చాలా మంది ఉమెన్ ఎంపవర్ గురించి మాట్లాడుతారు.. కానీ పుల్లెల గోపిచంద్ మహిళలను ప్రోత్సహించి ప్రపంచానికే పరిచయం చేస్తూ మహిళలపై తనకున్న గౌరవాన్ని చాటుతున్నారన్నారు. సైబరాబాద్ పరిధిలో 12 శాతం మహిళలు విధులు నిర్వహిస్తున్నారన్నారు. సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్గనైజేషన్ చిన్న అడుగుతో మొదలై అనేక మంది సభ్యులకు చేరువైందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని షీ షటిల్, షీ టీంలను హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేటల పరిధిలో ఏర్పాటు చేశారని అన్నారు. భద్రత విషయంలో తెలంగాణ అన్ని విధాలా సేఫేస్ట్గా ఉందన్నారు.
మహిళల భద్రతను దృష్టిలో ఉంచుకొని షీ సేఫ్ యాప్ను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని ఎస్సీఎస్సీ జనరల్ సెక్రటరీ కృష్ణ యెదు ల్లా అన్నారు. ఐటీ కారిడార్లో 4 లక్షల మంది మహిళా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని, అందులో కొంతమంది వర్క్ ఫ్రం హోం, మరికొందరు కార్యాలయాల్లో పనిచేస్తున్నారన్నారు. వారందరికీ భద్రత ఏర్పాట్లను చేయడంలో షీ టీం కీలకంగా వ్యవహారిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉమెన్స్ ఫోరం జాయింట్ సెక్రటరీ ప్రత్యూష శర్మ, డీసీపీలు అనసూయ, వెంకటేశ్వర్లు, పద్మజ, టెక్ మహీంద్రా సెంట్రల్ చీఫ్ వినయ్ అగర్వాల్ , పలు స్వచ్ఛంద సంస్థలు, తదితరులు పాల్గొన్నారు.