మారుమూల గ్రామానికి కూడా సైబర్ నేరాలు విస్తరించడంతో వాటిని కట్టడి చేయడానికి సైబరాబాద్ పోలీసు కమిషనర్ సజ్జనార్ సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. దీని కోసం సైబరాబాద్ పరిధిలో ఉన్న 44శాంతి భద్రతల పోలీస్ స్టేషన్లలో ప్రత్యేక సైబర్ సెల్ను ఏర్పాటు చేశారు. పైలట్ ప్రాజెక్ట్ కింద ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆయా పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులను నమోదు చేసుకోనున్నారు.
300మందికి ప్రత్యేక శిక్షణ
సైబర్ సెల్ను పటిష్టం చేయడానికి సీపీ సజ్జనార్ దాదాపు 300మంది సబ్ ఇన్స్పెక్టర్లు, కానిస్టేబుళ్లకు ప్రత్యేక శిక్షణను ఇప్పించారు. ఇటీవల కానిస్టేబుళ్లుగా ఎన్నికైన వారిలో ఉన్నత విద్యార్హతలు ఉన్న కొందరిని ఎంపిక చేసి వారిని సైబర్ సెల్కు ఉపయోగించుకుంటున్నారు. ఒక్కో సైబర్ సెల్లో సబ్ ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరు స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడంతో పాటు సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదులను స్వీకరించనున్నారు. వీరికి సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ అధికారులు దర్యాప్తు అంశాలకు సంబంధించిన సూచనలు ఇవ్వనున్నారు. అంతేకాకుండా నిందితులను పట్టుకునేందుకు ఇతర రాష్ర్టాలకు కూడా వీరిని తీసుకువెళ్లనున్నారు. ఇక సైబర్ క్రైం ఫిర్యాదులపై దర్యాప్తు వేగవంతంగా సాగనున్నది.
పలు అంశాలపై శిక్షణ
సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదును ఎలా నమోదు చేయాలి
ఫిర్యాదు నమోదు సమయంలో ఏ సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేయాలి
ప్రాథమికంగా ఆధారాలను ఎలా సేకరించుకోవాలి
ముందుగా ఎవరిని అప్రమత్తం చేయాలి
ఐపీ అడ్రస్లను ఎలా గుర్తించాలి
వాట్సాప్ కాల్స్ను ఎలా ట్రాక్ చేయాలి
ఇతర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలి అనే అంశాలను వివరించారు.
గచ్చిబౌలి రావాల్సిన అవసరం లేదు
షాద్నగర్, రాంచంద్రపురం, మేడ్చల్, శామీర్పేట్ వరకు విస్తరించి ఉన్న పోలీస్ స్టేషన్ల పరిధిలోని బాధితులు సైబర్ క్రైం ఫిర్యాదుల కోసం గచ్చిబౌలిలోని ప్రధాన సైబర్ క్రైం పోలీస్ స్టేషన్కు రావాల్సిన అవసరం లేదని సీపీ తెలిపారు. ఇక నుంచి స్థానిక పీఎస్లో ఫిర్యాదులు స్వీకరించడంతో పాటు కేసు తాజా స్థితిని బాధితుడు తెలుసుకునే విధంగా సైబర్ సెల్ అందుబాటులో ఉంటుందన్నారు.
సైబర్ నేరాలను కట్టడి చేస్తాం
సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చాలా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. వాటి బారిన ప్రజలు పడకుండా ఉండేందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి ఠాణాకు సైబర్ సెల్ కార్యక్రమాన్ని చేపట్టాం. గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఫిర్యాదులను స్వీకరిస్తారు. సైబర్ నేరాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ సైబర్ సెల్ పనిచేస్తుంది. దాదాపు 300మందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి వారికి ఈ సైబర్ సెల్ నిర్వహణ బాధ్యతను అప్పగించాం. – సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్