హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో కలకలం సృష్టించిన రెండు గ్యాంగ్రేప్ కేసులు కల్పితాలేనని సిటీ పోలీసులు తేల్చారు. సినిమా తరహాలో కట్టుకథలు అల్లిన ఓ ఇద్దరు యువతులు పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారిపై ఎలాంటి అత్యాచారం జరగలేదని పోలీసుల విచారణలో తేలింది. ఒకరేమో ప్రియుడు పెళ్లి చేసుకోలేదని, మరొకరేమో కల్లుకు బానిస అయి.. తమపై అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రెండు కేసులను పోలీసులు సవాలుగా తీసుకొని విచారించారు. చివరకు ఈ యువతులపై అత్యాచారం జరగలేదని, అభూత కల్పన అని తేలింది.
మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి చికిత్స నిమిత్తం ఈ నెల మొదటి వారంలో గాంధీ ఆస్పత్రికి వచ్చాడు. రోగి వెంట ఆయన భార్య, మరదలు కూడా వచ్చారు. అయితే ఈ ఇద్దరు మహిళలకు కల్లు తాగే అలవాటు ఉంది. నగరంలో కల్లు దొరక్కపోవడంతో.. ఐదు రోజుల పాటు అలాగే ఉండిపోయారు. దీంతో వారి మానసికస్థితి సరిగా లేక పిచ్చిపిచ్చిగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. ఆగస్టు 11వ తేదీన అక్క తన భర్తను వదిలి వెళ్లిపోయింది. అక్క తనకు తెలియకుండా వెళ్లిపోవడంతో చెల్లి కూడా ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు గాంధీ ఆస్పత్రి ఆవరణలోనే తిరుగుతూ.. అక్కడున్న సెక్యూరిటీ గార్డుతో పరిచయం పెంచుకుంది. 12, 14 తేదీల్లో సెక్యూరిటీ గార్డుతో చెల్లి సన్నిహితంగా మెలిగింది. ఇక అక్క ఆచూకీ తెలియకపోవడంతో తనపై గ్యాంగ్రేప్ జరిగిందని చెల్లి ఓ కట్టుకథ అల్లింది.
ఈ కేసును పోలీసులు సవాలుగా తీసుకున్నారు. దీంతో గాంధీ ఆస్పత్రి ఆవరణతో పాటు ఆ పరిసరాల్లో ఉన్న వందలాది సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ వీడియోలను గంటల కొద్ది పరిశీలించారు. ఎక్కడ కూడా అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లు కనిపించలేదు.
ఆస్పత్రి నుంచి అక్క కనిపించకుండా పోయేసరికి ఆమెకు ఏం చేయాలో తోచలేదు. తనను కుటుంబ సభ్యులు ఏమంటారోనని భయపడింది. ఇక అక్కడున్న వాచ్మెన్తో సన్నిహితంగా మెలిగిన ఆమె.. తనపై అత్యాచారం జరిగిందని, వరుసకు కుమారుడైన యువకుడికి చెప్పి మహబూబ్నగర్ బయల్దేరింది.అక్కడ ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు స్వీకరించలేదు. దీంతో ఆమె మళ్లీ హైదరాబాద్కు వచ్చి చిలకలగూడ పీఎస్లో ఫిర్యాదు చేసింది. తనను గ్యాంగ్ రేప్ చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆమె.. అలాంటిదేమీ లేదని పోలీసుల విచారణలో స్పష్టమైంది. తాను భయపడి అత్యాచారం జరిగినట్లు కల్పిత కథ సృష్టించానని పోలీసుల విచారణలో ఆమె తెలిపింది.
సంతోష్నగర్కు చెందిన ఓ యువతి కూడా తనపై సామూహిక అత్యాచారం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ ఆమెపై అత్యాచారం జరగలేదని తేలింది. తాను ప్రేమించిన ప్రియుడు.. పెళ్లి చేసుకోనని చెప్పడంతో అతన్ని ఎలాగైనా పోలీసు కేసులో ఇరికించాలని ప్లాన్ చేసింది సదరు యువతి. దీంతో అత్యాచారం కథకు తెర లేపింది. ఓ రాత్రంతా చాంద్రాయణగుట్టలో తిరిగి.. ఆ రోజు రాత్రి తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తల్లికి తెలిపింది యువతి. తన ప్రియుడే తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు చెప్పడంతో.. వారు విచారించగా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రియుడిపై కోపంతోనే ఈ కట్టుకథ అల్లినట్లు ఆమె పోలీసుల ఎదుట ఒప్పుకుంది.