బేగంపేట్ మే 27: లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ హెచ్చరించారు. గురువారం సికింద్రాబాద్ వెస్లీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను సందర్శించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రోజుకు 8 వేల లాక్డౌన్ ఉల్లంఘన కేసులు నమోదవుతున్నట్లు తెలిపారు. కొందరు ఈ పాస్లను దుర్వినియోగం చేస్తున్నారని, అలాంటి వారిని ఉపేక్షించమన్నారు. కాగా, కరోనా వైరస్ ఆకృతితో కూడిన వేషధారణలో పోలీసులు వాహనదారులకు వినూత్నంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ కల్మేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
మన్సూరాబాద్, మే 27: నగరంలో వివిధ వైద్యశాలలకు వెళ్లే డాక్టర్లు, సిబ్బంది, అంబులెన్సుల కోసం నాగోలు చెక్పోస్టు వద్ద ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్భగవత్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితులతో పాటు ఈ పాస్ ఉన్న వారికి ఎలాంటి ఆటంకాలు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గురువారం నాగోల్ బ్రిడ్జి వద్ద ఎల్బీనగర్ పోలీసులు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ను పరిశీలించి.. సిబ్బందికి పలు సూచనలు చేశారు. లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు ప్రజలతో దురుసుగా వ్యవహరించకుండా సంయమనం పాటించాలని సూచించారు. అనవసరంగా బయటకు వచ్చే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీపీ వెంట ఎల్బీనగర్ డీసీపీ (ట్రాఫిక్) శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ (ట్రాఫిక్) మనోహర్, ఏసీపీ శ్రీధర్రెడ్డి, సీఐ అశోక్రెడ్డి ఉన్నారు.
సిటీబ్యూరో, మే 27(నమస్తే తెలంగాణ): లాక్డౌన్ సమయంలో చెక్పోస్టుల వద్ద అత్యవసర వాహనాలకు ఆటంకాలు కలుగకుండా సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశారు. రాచకొండలో 20, సైబరాబాద్ పరిధిలో 75 చెక్ పాయింట్ల వద్ద ఈ ప్రత్యేక రూట్లు ఉన్నాయి. అక్కడి రహదారులను మూడు భాగాలుగా విభజించి ఒక మార్గం ద్విచక్రవాహనాలు, రెండో మార్గం కార్లు, ఆటోలకు, మూడోది అంబులెన్సులు, పోలీసు ఉన్నతాధికారులు, వైద్యులు, ఆక్సిజన్ సరఫరా చేసే వాహనాల కోసం ఏర్పాటు చేశారు.