ఏ కష్టం వచ్చినా..మేమున్నామని..మీకేంకాదని..భరోసానిస్తున్న పోలీసులు…వరద సహాయక చర్యల్లోనూ ముం దుంటున్నారు. ప్రజలు ఆపదలో చిక్కుకోకుండా నిరంతరం కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. నగరంలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా..దీటుగా ఎదుర్కొనేందుకు పోలీస్శాఖ సర్వసన్నద్ధమైంది.
హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు అంజనీకుమార్, స్టీఫెన్ రవీం ద్ర, రాచకొండ అదనపు పోలీసు కమిషనర్ సుధీర్బాబు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పోలీసు స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ను నిర్వహించి వర్షంతో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగించేందుకు సూచనలను ఇస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో పౌరులు పోలీసుల సహాయం కోరవచ్చని , డయల్ 100కు ఫోన్ చేయాలని సూచిస్తున్నారు.
రహదారులపై వాటర్లాగింగ్ పాయింట్స్ వద్ద ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటున్నారు. అక్కడ వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇక శివారు ప్రాంతా ల్లో చెరువులన్నీ నిండుకుండలా మారడంతో మరింత అలర్ట్ అయ్యారు. నాలాల వద్ద పొంచి ఉన్న ముప్పును పసిగట్టి అక్కడ పరిస్థితులను సంబంధిత శాఖల అధికారులకు అందిస్తున్నారు. ముందస్తుగా రిజర్వు పోలీసు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో పెట్టారు. గల్లీల్లో పెట్రోలింగ్ను మరింతగా పెంచారు.
సికింద్రాబాద్కు చెందిన బాలకృష్ణ, పల్లవి దంపతులు వర్షం కారణంగా సోమవారం రహదారిపై కష్టాలు ఎదుర్కొన్నారు. పైగా పల్లవి గర్భవతి కావడంతో ఆమె తీవ్రంగా ఇబ్బందిపడింది. ఒకవైపు వర్షం కురుస్తుండటం.. మరోవైపు అంబులెన్స్లు వచ్చే పరిస్థితి కూడా లేకపోవడంతో భర్త ఆందోళనకు గురయ్యాడు. ఆ దంపతుల ఇబ్బందులను గమనించిన పెట్రోలింగ్ సిబ్బంది వారివద్దకు చేరుకున్నారు.
చిలకలగూడ పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ కిరణ్, హోంగార్డు ఇమ్రాన్లో పల్లవిని పెట్రోలింగ్ వాహనంలో గాంధీ దవాఖానకు తరలించారు. స్ట్రెచ్చర్ను తెచ్చే సమయం కూడా లేకపోవడంతో ఆమెను భర్త సహకారంతో కానిస్టేబుల్ కిరణ్..దవాఖానలోకి చేతులపై ఎత్తుకొని తీసికెళ్లారు. పల్లవి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని సదరు కానిస్టేబుల్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్మీడియాలో పోస్టు చేయడంతో నెట్జన్లు పోలీసుల సేవలకు హ్యాట్సాప్ చెబుతున్నారు.
కోకాపేట సర్కిల్ రోటరీ అండర్పాస్ బ్రిడ్జి వద్ద నీటిలో మునిగిన ఓ కారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులను తీవ్రంగా కలవరపెట్టింది. ఓ సందర్భంలో అందులో ఎవరైనా ఉండి ప్రమాదంలో ఉన్నారా అనే ఆందోళనను గురి చేసింది. గచ్చిబౌలి ట్రాఫిక్ ఎస్ఐ విజయ్నాయక్ ఆ నీటి ముంపులో వెళ్లి..కారులో ఎవరున్నారని ఆరా తీశారు. ఎవరూ లేకపోవడంతో ఊపిరీ పీల్చుకున్నారు.