నేరగాళ్ల ఎత్తులను పోలీసులు చిత్తు చేస్తున్నారు. టెక్నాలజీకి దూరంగా ఉన్నాం.. ఫోన్లు వాడటంలేదు.. సీసీ కెమెరాలకు కనిపించం.. ఎలా పట్టుకుంటారు.. అంటూ సవాల్ విసురుతున్న నేరగాళ్ల తాటా తీస్తున్నారు. నేరగాళ్లు తప్పించుకునేందుకు ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. పోలీసులు వలపన్ని పట్టుకుంటున్నారు. ఇటీవల ఉప్పల్లో బయటపడ్డ ఓ యువకుడి కాలిన మృతదేహం, జవహర్నగర్లో మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన ఘటనలు, ఎల్బీనగర్లోని ఓ మొబైల్ షాపులో జరిగిన చోరీ కేసు మిస్టరీని పోలీసులు అతి తక్కువ సమయంలో ఛేదించి నేరస్తులను పట్టుకున్నారు. ఈ కేసుల్లో పోలీసు ఆఫీసర్స్ చేసిన దర్యాప్తు చాలా ఆసక్తికరంగా ఉంది.
గత నెలలో.. ఎల్బీనగర్లోని ఓ మొబైల్ షాపు గోడకు రంద్రం చేసి, 36 సెల్ఫోన్లు దొంగతనం చేశారు. ఫిర్యాదు అందగానే పోలీసులు రంగంలోకి దిగి తొలుత సీసీ కెమెరాలను పరిశీలించారు. ఆ దృశ్యాలను మెరుగుపర్చారు. సీసీ కెమెరాల దృశ్యాలతో వారి నడక, హావభావాలు, ఎత్తు విశ్లేషించారు. నేరగాళ్లు స్థానికులు కాదని.. ఉత్తరాది రాష్ర్టాలకు చెందిన వారిగా అంచనాకు వచ్చారు. ఆ సమీపంలో జరుగుతున్న కార్మికుల చిట్టాను ఆరాతీశారు. ముగ్గురు కార్మికులు లేరని తెలుసుకుని వారి ఫోన్ నంబర్లు సేకరించారు. అవి స్విచాఫ్లో ఉన్నాయి. దీంతో సైంటిఫిక్ పద్ధతిలో దర్యాప్తు చేపట్టారు. బృందాలను ఏర్పాటు చేసి వారి స్వస్థలం వివరాలతో ఆ సమయంలో రైలు, బస్సులకు సంబంధించిన సమాచారాన్ని గుర్తించారు. రైల్వే, బస్టేషన్లలో ఆరా తీశారు. ఆ సమయంలో బయలుదేరిన రైలు, బస్సులు ఎన్ని గంటల్లో గమ్యం చేరుకుంటాయని తెలుసుకొని, ఓ బృందాన్ని విమానంలో కోల్కత్తాకు పంపారు. ఆ తర్వాత అక్కడి పోలీసుల సహాయంతో రైలు దిగగానే దొంగలను పట్టేశారు.
ఉప్పల్ ప్రాంతంలో కొద్ది రోజుల కిందట సగం కాలిన ఓ యువకుడి మృతదేహం బయటపడింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇది ఆత్మహత్య అయి ఉంటుందని ప్రాథమికంగా నిర్ధారించారు. ఉన్నతాధికారుల అనుమానంతో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. తొలుత సీసీ కెమెరాలను పరిశీలించారు. ఎక్కడా చిన్న క్లూ దొరకలేదు. చివరకు ఓ సీసీ కెమెరాలో ఓ సెకండ్ పాటు వెలుగు వచ్చి ఆరిపోయినట్లు కనిపించింది. ఆ వెలుగుపై విశ్లేషించి, ఓ ఆటో వెళ్లినట్లు గుర్తించారు. ఆ ఆటోను లింక్ చేసుకుంటూ పోలీసులు దర్యాప్తు ముందుకు తీసుకువెళ్లగా.. ఓ అడ్రస్ దొరికింది. అక్కడ ఆటోలు నడిపించే వారి కోసం ఆరా తీశారు. మూడు, నాలుగు రోజుల నుంచి ఇంటిలో లేని వారి గురించి ఆరా తీశారు. వారిని ప్రశ్నించడంతో యువకుడిని ఓ ఫోన్ కోసం హత్య చేసినట్లు వెల్లడైంది. నిందితులు తెలివిగా మొబైల్ ఫోన్లు వాడకుండా జాగ్రత్త పడ్డారు.
దొంగలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. టెక్నాలజీకి దూరంగా ఉన్నా.. సీసీ కెమెరాల్లో కనిపించకుండా ప్రయత్నించినా.. పోలీసులకు ఓ చిన్న ఆధారం దొరికితే చాలు.. వాటిని శాస్త్రీయంగా విశ్లేషించి నేరస్తుడిని పట్టుకుంటున్నారు. ఎంతటి నేరగాడినైనా పట్టుకునే సత్తా ఉందని పోలీసులు రుజువు చేస్తున్నారు.
జవహర్నగర్లో ఇటీవల ఓ మైనర్ బాలికపై గుర్తు తెలియని వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన తీవ్ర సంచలనం రేపింది. పోలీసులు మొబైల్ ఫోన్ను ట్రాక్ చేశారు. ఫలితం లేదు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ చిన్న క్లూ దొరికింది. దీంతో చిత్రాలను గీయించారు. ఒక అనుమానితుడికి సంబంధించిన ఓ రూపం రావడంతో గాలింపును ముమ్మరం చేశారు. ఇదే సమయంలో మరో బాలికపై లైంగికదాడికి యత్నించాడు. ఆ సమయంలో తల్లి అనుమానితుడిని చూసింది. పోలీసులు గీయించిన ఫొటోను ఆమెకు చూపడంతో అతడేనని స్పష్టం చేసింది. ఈ ఆధారంతో పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు. సార్, నేను ఫోన్ వాడలేదు.. అయినా, మీరు ఎలా పట్టుకున్నారు.. అని నిందితుడు అడిగినట్లు తెలిసింది.