పుడింగ్ పబ్ రెగ్యులర్ కస్టమర్లపై ఆరా
రహస్యంగా వచ్చే వారి వివరాలు సేకరణ
నేడు పోలీస్ కస్టడీకి నిందితులు
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): పుడింగ్ అండ్ మింక్ పబ్కు వచ్చే రెగ్యులర్ ఖాతాదారుల వివరాలను పోలీసులు సేకరించే క్రమంలో రహస్యంగా నిర్వహించే కస్టమర్ల డాటా కూడా లభ్యమైంది. పబ్కు తరుచుగా వచ్చిపోయే వారితో పాటు ఎప్పుడో ఓసారి వచ్చిపోయే ఖాతాదారులున్నట్లు గుర్తించారు. రాడిసన్ బ్లూ ఆవరణలో నిర్వహించే ఈ పబ్లోకి ఎంట్రీ కావాలంటే పామ్ యాప్లో రూ.50 వేల నుంచి లక్ష చెల్లించి తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో సభ్యత్వం తీసుకున్న వారినే నిర్వాహకులు లోపలికి అనుమతిస్తారు.
అయితే సభ్యత్వం లేకుండా పబ్బుకు వచ్చే రెగ్యులర్ కస్టమర్లు 500 వరకు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అందులో కొందరి వివరాలను ఇప్పటికే సేకరించారు. మిగతావారి వివరాలను కూడా పోలీసులు సేకరించే పనిలో ఉన్నారు. అర్ధరాత్రి తరువాత పబ్బు తెరిచి ఉంటుందనే భావనతో వచ్చే కస్టమర్లు కొందరైతే, డ్రగ్స్ దొరుకుతుందని, ఆ సమయంలో ఎవరూ పట్టించుకోరనే భావనతో వచ్చే వారు మరికొందరు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు సేకరించిన కస్టమర్ల వివరాలు సీసీ పుటేజీలు, కాల్ డేటాను క్రోడీకరించి నిందితులను ఆయా అంశాలపై ప్రశ్నించనున్నారు.
నేడు పోలీస్ కస్టడీకి నిందితులు
న్యాయస్థానం అనుమతి మేరకు గురువారం నిందితులు ఉప్పల అభిషేక్, మేనేజర్ అనిల్కుమార్ను బంజారాహిల్స్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు అందజేశారు? ఎప్పటి నుంచి డ్రగ్స్ దందా నడుస్తున్నది? ఎంత మంది కస్టమర్లకు డ్రగ్స్ సరఫరా చేశారనే ప్రధాన అంశాలపై పోలీసులు విచారణ చేయనున్నారు. ఇప్పటికే సేకరించిన సమాచారం ఆధారంగా ప్రశ్నించనున్నారు.