‘అన్నా నమస్తే అన్నా. నా పేరు మహేశ్ ముదిరాజ్ అన్నా. మేడ్చల్ మండలం రావల్కోల్ నా ఊరు. అన్నా నాకు మా తాతల నాటినుంచి ఉన్న భూమి గదొక్కటే అన్నా.. నీకు దండం పెడుతాను.. నా భూములను మీ కొడుకు ఈటల నితిన్రెడ్డి కొన్నారట.. నా భూమి నాకు ఇప్పించండి అన్నా.. నేనూ ముదిరాజ్ బిడ్డనే అన్నా..’ ముదిరాజ్ల ముద్దుబిడ్డగా ప్రకటించుకుంటున్న మాజీ మంత్రి ఈటల రాజేందర్తో అదే సామాజికవర్గానికి చెందిన మహేశ్ సుమారు 8 నెలల కిందట చెప్పుకొన్నగోడు ఇది.
‘ముదిరాజ్ అయితే ఏంటి మరి.. ఆ భూములను కొన్నాం.. మాకు అన్ని హక్కులు ఉన్నాయి. నీకు ఏం హక్కు ఉన్నది.. నీకు దిక్కున్నచోట చెప్పుకోపో.. ఇదే పనికొరకైతే మరోసారి నా దగ్గరికి రాకు. ఇగ పో..’ మహేశ్ ముదిరాజ్ గోడుపై ఈటల రాజేందర్ స్పందన ఇది.
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 23 (నమస్తే తెలంగాణ): తమ తాత పేరిట సర్వే నంబర్ 77లోని 10.11 ఎకరాలకు పీటీలతోపాటు 38 (ఈ) పట్టా సర్టిఫికెట్ ఉన్నప్పటికీ ఆ భూమిని ఈటల రాజేందర్ కుటుంబం చెరపట్టిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు మేడ్చల్ మండలం రావల్కోల్కు చెందిన బాధితుడు పిట్ల మహేశ్ ఫిర్యాదు చేశారు. తన వద్ద 38(ఈ) సర్టిఫికెట్ ఉన్నదని, 1954 నుంచి 1986 వరకు రికార్డుల్లో తన తాత పేరు ఉన్నదని, టెనెన్సీ, సీలింగ్ చట్టాల ప్రకారం ఈ భూమికి ఎన్నో ఏండ్లుగా హక్కుదారులుగా ఉన్నామని, దయచేసి భూమిని మాకు ఇప్పించి, న్యాయంచేయాలని మహేశ్ ఫిర్యాదులో వేడుకొన్నారు. ఈ ఫిర్యాదు కాపీని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్లో అందించగా, ఆదివారం సీఎం కేసీఆర్కు చేరింది. దీనిపై సీఎం వెంటనే స్పందించారు. ఈ అంశంపై తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు. ఏసీబీ, విజిలెన్స్, రెవెన్యూశాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఈ క్రమంలోనే తనకు జరిగిన అన్యాయాన్ని మహేశ్ ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. అతని వద్ద ఉన్న ఆధారాల ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
సీలింగ్ యాక్టులో స్వాధీనం..
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడ్చల్ మండలం రావల్కోల్ గ్రామంలోని సర్వే నంబర్లు 76, 77, 78 లలో సుమారు 36.53 ఎకరాల భూమి ఉన్నది. ఆ గ్రామానికే చెందిన రఘుపతిరెడ్డి, గోవింద్రెడ్డి, భూపాల్రెడ్డి, గుణ్వంత్రెడ్డి, జనార్దన్రెడ్డి, ప్రతాప్రెడ్డి అనే భూస్వాముల ఆధీనంలో ఈ భూమి ఉన్నది. ప్రొటెక్టెడ్ టెనెన్సీ (పీటీ- రక్షిత కౌలుదారు) చట్టం ప్రకారం.. 1952లో టేకుల మల్లయ్య తండ్రి అనంతయ్య, ఇట్టబోయిన బాబెయ్య తండ్రి తిమ్మయ్య, గాజుల మల్లయ్య తండ్రి లక్ష్మయ్య, రాంరెడ్డి తండ్రి రాజారెడ్డి, పిట్ల నర్సింహ తండ్రి బాలయ్య, కర్మకొండ నర్సయ్య తండ్రి ఎల్లయ్యలను ఈ భూమిపై 1952లో పీటీలుగా అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. సర్వే నంబర్ 77లో పిట్ల నర్సింహ 10.11 ఎకరాలకు పీటీ సర్టిఫికెట్ పొందారు. 1970లలో ఇనాం ట్రిబ్యునల్ వచ్చింది. 1975-76 లో సీలింగ్ యాక్ట్ కూడా వచ్చింది. దాని ప్రకారం ఈ భూస్వాముల వద్ద నిజాం ఇచ్చిన ఇనాం భూములు వేల ఎకరాలు ఉన్నట్టు అప్పటి ప్రభుత్వం గుర్తించింది. భూస్వాములను 54 ఎకరాలకు పట్టాదార్లుగా గుర్తిస్తూ ఆపై ఉన్న భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్నది. స్వాధీనం చేసుకొన్న భూముల్లో 1970 నవంబర్ 1వ తేదీ లోపు పీటీలుగా ఉన్నవారిని గుర్తించి కన్ఫర్మేషన్ ఆఫ్ పట్టా రైట్స్ కింద 38(ఈ) పట్టాలను జారీచేసింది. ఇందులో భాగంగానే పిట్ల నర్సింహకు కూడా 1976-75 సీలింగ్ యాక్టు ప్రకారం 38(ఈ) 10.11 ఎకరాలకు పట్టా సర్టిఫికెట్ను అప్పటి ప్రభుత్వం ఇచ్చింది. ఈ భూములకు హద్దులను నిర్ణయిస్తూ సీలింగ్ యాక్టు ప్రకారం ప్రొవిజినల్ పట్టాలను భూస్వాములకు అందించారు. 1954 ఖాస్రా పహాణీ నుంచి 1986 వరకు అన్ని పహాణీల్లోనూ సర్వే నంబర్ 77లోని 10.11 ఎకరాలకు హక్కుదారుడిగా పీట్ల నర్సింహ పేరు ఉన్నది.
పీటీలను, 38(ఈ)ని విస్మరించి ఓఆర్సీ
సీలింగ్ యాక్టు నిబంధనలకు విరుద్ధంగా భూస్వాముల వద్ద ఉన్న భూములను స్వాధీనం చేసుకున్న అప్పటి ప్రభుత్వం పీటీలుగా ఉండి కబ్జాలో ఉన్నవారికి 38(ఈ) జారీచేసినప్పటికీ.. నిజాం దానం ఇచ్చిన భూములపై భూస్వాములు అప్పటి ఇనాం ట్రిబ్యునల్ను ఆశ్రయించారు. ఇనాం ట్రిబ్యునల్ ద్వారా ఓఆర్సీ (ఆక్యుపెన్సీ రైట్ సర్టిఫికెట్)ను పొందారు. కానీ అప్పటి నిబంధనల ప్రకారం ఇనాం భూములపై ఓఆర్సీ ఇవ్వాలంటే.. ఆ భూములపై ఎలాంటి పీటీ (ప్రొటెక్టెడ్ టెనెన్సీ సర్టిఫికెట్)లు కానీ, 38(ఈ) పట్టా సర్టిఫికెట్ కానీ ఉండకూడదు. ఇవి ఉన్నప్పుడు ఓఆర్సీ ఇవ్వకూడదు. సదరు ఇనాం భూమిపై ఎలాంటి పీటీలు, 38(ఈ) లేవని స్థానిక ఎమ్మార్వో ధ్రువీకరించిన తర్వాతే ఓఆర్సీ జారీచేయాలి. ఏం జరిగిందో తెలియదు కానీ సర్వే నంబర్ 77లోని 10.11 ఎకరాల భూమిపై పిట్ల నర్సింహకు పీటీ, 38 (ఈ) పట్టా సర్టిఫికెట్తోపాటు పొజిషన్లోనూ, పహాణీల్లోనూ అతని పేరే ఉన్నప్పటికీ.. ట్రిబ్యునల్ భూస్వాములకు ఓఆర్సీ ఎలా ఇచ్చారనేది ఇక్కడ ప్రశ్నార్థకం.
1984 నుంచి క్రయవిక్రయాలు
పీటీ, 38(ఈ) ప్రకారం ఇది పిట్ల నర్సింహ పేర నమోదు కావడంతో ఇనాం నుంచి పిట్ల నర్సింహకు చెందిన పట్టా భూమిగా మారినప్పటికీ.. భూస్వాములు ఇనాం ట్రిబ్యునల్ ద్వారా వచ్చిన ఓఆర్సీని చూపుతూ 1984లో సత్యనారాయణరాజు తండ్రి రామరాజు అండ్ అదర్స్ పేర రఘుపతిరెడ్డి మరికొందరు డాక్యుమెంట్ నంబర్ 6224 OF 1984 ద్వారా విక్రయించారు. అనంతరం వీళ్లు వచ్చి పిట్ల నర్సింహ కొడుకు అయిన పిట్ల సత్తయ్యను భూమి పొజిషన్ నుంచి వెల్లగొట్టారు. 1986లో పహాణీల్లో సత్యం రామలింగరాజు అండ్ అదర్స్ పేర్లు వచ్చిచేరాయి. పహాణీల్లో ఇతరుల పేర్లు నమోదు కావడాన్ని గుర్తించిన పిట్ల నర్సింహ వారసులు అప్పటి మేడ్చల్ ఎమ్మార్వోను సంప్రదించారు. ఇది తమ భూమి అని, తమకు పీటీ సర్టిఫికెట్తోపాటు 38(ఈ) పట్టా సర్టిఫికెట్ ఉన్నాయని, ఈ భూమిని తామే సాగు చేసుకుంటున్నామని మొరపెట్టుకున్నా అధికారులు పెడచెవిన పెట్టారు.
దౌర్జన్యంగా కబ్జాలోకి..
ఈ భూములను కొనుగోలు చేసిన సత్యనారాయణరాజు అండ్ అదర్స్ ఈ భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకొన్నారు. ఆ తర్వాత ఓ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇందులో కొంత భాగాన్ని విక్రయించారు. ఈ విషయంపై అభ్యంతరం చెప్తూ.. పిట్ల నర్సింహ మనుమడు, పిట్ల సత్తయ్య కొడుకు అయిన పిట్ల మహేశ్ ముదిరాజ్ మేడ్చల్ ఎమ్మార్వో కార్యాలయంలో ఫిర్యాదుచేశారు. కానీ సదరు ఫిర్యాదును తీసుకొనేందుకు కూడా అప్పటి ఎమ్మార్వో నిరాకరించారు. అనంతరం ఈ భూమిపై నుంచి వెళ్లి పోవాలని సత్యనారాయణరాజు అండ్ అదర్స్కు చెందిన కొందరు బెదిరించారు. వాళ్లను ప్రతిఘటించిన మహేశ్ ముదిరాజ్, ఆయన కుటుంబసభ్యులు తమకు ఆధారాలున్నాయని నిలదీశారు. ఆధారాలు తీసుకొస్తే సెటిల్ చేసుకొందామని సూచించిన సత్యనారాయణరాజు మనుషులు మహేశ్కు ఆహ్వానం పంపారు. ఇది నమ్మిన బాధితుడు వాళ్ల కారులో వాళ్లతోపాటు కలిసి వెళ్లారు. సుమారు రెండు రోజులపాటు మహేశ్ను చిత్రహింసలు పెట్టిన సత్యనారాయణ రాజు మనుషులు, రియల్ కంపెనీకి చెందిన వ్యక్తులు బాధితుడి వద్ద ఉన్న 38 (ఈ) పత్రాలు చించేశారు. రెండో రోజు అర్ధరాత్రి అతన్ని మేడ్చల్లో వదిలి వెళ్లారు. భయభ్రాంతులకు గురైన మహేశ్ తన కుటుంబసభ్యుల సహకారంతో దవాఖానలో చికిత్స పొంది కోలుకున్న అనంతరం తన భూమి కోసం పోరాటాన్ని మళ్లీ కొనసాగించారు. సత్యనారాయణ రాజుకు చెందిన వ్యక్తుల చేతిలో చిరిగిపోయిన పత్రాలను ఎమ్మార్వో, ఆర్డీవో, కలెక్టర్ కార్యాలయాల నుంచి తిరిగి పొందేందుకు మహేశ్కు కొన్నేండ్లు పట్టింది.
వివాదంలోకి చొరబడ్డ ఈటల తనయుడు
ఈ వివాదం కొనసాగుతుండగానే ఈటల తనయుడు ఈ వ్యవహారంలోకి తలదూర్చాడు. సత్యం రామలింగరాజు అండ్ అదర్స్ వివాదాన్ని పరిష్కరించుకోలేక సతమతమవుతున్న పరిస్థితిని సొమ్ము చేసుకొన్నాడు. తాను ఏం చేసినా కాపాడటానికి మంత్రి పదవిలో ఉన్న తండ్రి ఉన్నాడన్న ధైర్యంతో సత్యం రామలింగరాజు దగ్గరనుంచి 2019-20లో ఆ భూమిని అగ్గువకు ఈటల తనయుడు నితిన్రెడ్డి, బినామీగా చెప్తున్న సాదా కేశవరెడ్డి కొన్నారు. దీంతో మహేశ్ పోరాటం సత్యం రామలింగరాజు నుంచి ఈటల దగ్గరకు మారింది.
ఈటలను సంప్రదించిన బాధితుడు
తమకు పీటీ, 38 (ఈ) పట్టా ఉన్న సంగతి తెలియక ఈటల తనయుడు ఆ భూమిని కొన్నాడేమోనని మహేశ్ ముదిరాజ్ ముందుగా భావించాడు. ‘1952లోనే మా కుటుంబానికి పీటీలతోపాటు 38 (ఈ) పట్టా సర్టిఫికెట్ ఉన్నట్టు ఈటల తనయుడికి తెలియదేమో? అందుకే నా భూమిని కొన్నారు. రాజేందర్ అన్న మా ముదిరాజ్ బిడ్డనే కదా.. నాకు న్యాయం చేస్తారు’ అని గట్టి నమ్మకంతో మహేశ్ తన వద్ద ఉన్న ఆధారాలన్నీ పట్టుకొని నాడు మంత్రి పదవిలో ఉన్న ఈటలను కలిసే ప్రయత్నంచేశారు. మధ్యవర్తులతో, ఈటల పీఏతో మాట్లాడితే.. ‘ఇక్కడికి రావొద్దు. ఆ భూమిని మేం కొన్నాం. నీకు అవకాశం లేదు’ అని చెప్పి పంపించారని బాధితుడు వాపోయాడు. అయినా.. తగ్గని మహేశ్ సుమారు 8 నెలల కిందట ఈటల రాజేందర్ను కలిసి మొరపెట్టుకొన్నారు. ‘ముదిరాజ్ అయితే ఏంటి మరీ.. ఇదే పనికొరకు అయితే మరోసారి ఇక్కడి రానవసరం లేదు’ అంటూ వెళ్లగొట్టారని చెప్పాడు. ముదిరాజ్ బిడ్డగా తనకు న్యాయం చేస్తాడనే ఆశతో వెళ్లిన మహేశ్కు ఈటల వద్ద భంగపాటు తప్పలేదు. ఏం చేయాలో తోచక అయోమయంలో ఉన్న మహేశ్కు ఇటీవల ఈటల భూబాగోతాలు వెలుగులోకి వస్తుండటంతో ధైర్యం వచ్చింది. వెంటనే ఓ వీడియోను రికార్డుచేసి సోషల్మీడియాలో పోస్టుచేయడంతోపాటు రెవెన్యూ అధికారులకు, పోలీసులకు ఫిర్యాదుచేశారు. అది సీఎం దాకా వెళ్లడంతో సమగ్ర విచారణకు ఆదేశించారు.