సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ కేసుల్లో అరెస్ట్ చేయడమే కాదు.. డ్రగ్స్ అలవాటును పూర్తిగా మాన్పించేందుకు హైదరాబాద్ పోలీసులు నడుంబిగించారు. ఇందులో భాగంగా డ్రగ్స్ కేసులో అరెస్టు అయిన విక్రేతలు, వినియోగదారులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు, పునరావాసం కల్పించేందుకు నాలుగు పునరావాస(కౌన్సెలింగ్) కేంద్రాలతో శుక్రవారం సీపీ సీవీ ఆనంద్ ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఈ మేరకు ఒప్పంద పత్రాలను విలేకరుల సమావేశంలో ఇనిస్టిట్యూట్ అఫ్ మెంటల్ హెల్త్(ఎర్రగడ్డ) ఇన్చార్జి సూపరింటెండెంట్, హెచ్ఓడీ డాక్టర్ ఎస్.శిరీష, ది అశా గ్రూప్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ జగన్నాథరావు, ఫోనెక్సి రెహబ్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డాక్టర్ గీతా మంగానని, అమృత ఫౌండేషన్ సొసైటీ సంస్థకు చెందిన డాక్టర్ దేవిక రాణిలకు సీపీ ఒప్పంద పత్రాలను అందించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ డ్రగ్స్ కేసుల్లో పట్టుబడిన విక్రేతలు, వినియోగదారులకు ఈ కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు. డ్రగ్స్కు ఏ మేర అలవాటు పడ్డారనే విషయాన్ని నిర్ధారించుకున్న తరువాత వారికి ఆయా సంస్థల ప్రతినిధులు కౌన్సెలింగ్ నిర్వహిస్తారని తెలిపారు.
వారానికి రెండు సార్లు కౌన్సెలింగ్
నాలుగు వారాల పాటు వారానికి రెండు సార్లు కౌన్సెలింగ్ కొనసాగుతుందని, తరువాత నాలుగు వారాలు వారానికి ఒక రోజు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. ఈ సందర్భంగా రక్తపు, మూత్ర పరీక్షలు కూడా 8 వారాల సమయంలో కనీసం మూడు సార్లు పరీక్షిస్తారని, ఇది నిబంధనల మేరకు కౌన్సెలింగ్ తీసుకుంటున్న వారి అనుమతితో జరుగుతుందని చెప్పారు. కౌన్సెలింగ్కు వెళ్లడం ద్వారా డ్రగ్స్ తీసుకునే అలవాటును పూర్తిగా మానుకుంటారని తెలిపారు. ఇప్పటి వరకు డ్రగ్స్ను తీసుకుంటున్న వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారని సీపీ వివరించారు.
ఎర్రగడ్డలో ఉచిత సేవలు
ఔట్పేషెంట్గా ఈ సంస్థలు ట్రీట్మెంట్ చేస్తాయని, అవసరమైన వారికి ఇన్ పేషెంట్లుగా కూడా చికిత్స అందిస్తాయని సీపీ తెలిపారు. ప్రైవేట్ సంస్థల్లో ఫీజులు తీసుకుంటుండగా, ఎర్రగడ్డలో ఉచిత సేవలు అందుతాయని చెప్పారు. ఈ ఏడాది డ్రగ్స్తో సంబంధమున్న 377 మందిని అరెస్ట్ చేశామన్నారు. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో నమోదైన కేసుల(25.12.2021 నుంచి 4.05.2022) వివరాలను వెల్లడించారు.