నిర్మల్ : పేదలు ఆత్మ గౌరవంతో జీవించాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్ రూం పథకం ప్రవేశ పెట్టారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణ వాసుల కోసం సిద్ధాపూర్ లో రూ.31.80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 600 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు లేని పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు అందజేస్తామన్నారు. స్వరాష్ట్రంలో ప్రతి పేదవాడు రెండు పడకల ఇంటిలో సకల సౌకర్యాలతో దర్జాగా కాలుమీద కాలేసుకుని బతకాలన్న సీఎం కేసీఆర్ మహోన్నత ఆశయం మేరకే ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం చేపట్టిందని పేర్కొన్నారు.
పట్టణ వాసులు కోసం 2100 ఇండ్లు నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయం మేరకు సొంత జాగా ఉన్న వారు స్వయంగా వారే ఇండ్లు నిర్మించుకునేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని పునరుద్ఘాంటించారు.
కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఎక్కడా కూడా అభివృద్ధి పనులు ఆగలేదని, సంక్షేమ పథకాలకు నిధులు మంజూరు చేసి లబ్ధిదారులకు అందజేస్తున్న ఘనత ఒక్క తెలంగాణ ప్రభుత్వానికే దక్కిందన్నారు. అర్హులైన వారికి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేస్తుందని హామీనిచ్చారు.