సిటీబ్యూరో, జూలై 28 (నమస్తే తెలంగాణ): ఉప్పల్ భగాయత్లో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అభివృద్ధి చేస్తున్న లే అవుట్ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇప్పటికే రహదారులకు సంబంధించి మార్కింగ్ను గుర్తించిన అధికారులు క్షేత్రస్థాయిలో పనులు నిర్వహిస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాల మూలంగా ఈ పనుల్లో కొంత జాప్యం జరిగిందని, మరో ఆరు నెలల్లో 20 ఎకరాల్లో లే అవుట్ను రూపొందిస్తామని మెట్రో అధికారి ఒకరు తెలిపారు. కాగా ఈ ప్రాంతం నివాసయోగ్యానికి అనువుగా ఉండడం, ఇప్పటికే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) సంస్థ భారీ లే అవుట్ అభివృద్ధి చేసి ప్లాట్లను విక్రయించడంతో ఇదే తరహాలో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తన ఖాతాలో ఉన్న మొత్తం 41 ఎకరాల్లో మొదట 20 ఎకరాల్లో లేఅవుట్ను చేపట్టి, ఆన్లైన్లో విక్రయించి భారీగా ఆదాయాన్ని రాబట్టుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నది.
ఈ లే అవుట్కు ప్రభుత్వం నుంచి అనుమతి రాగా.. అభివృద్ధి చేసిన ప్లాట్లను ఆన్లైన్లో విక్రయించేందుకు మాత్రం అనుమతివ్వాల్సి ఉందని మెట్రో అధికారులు తెలిపారు. కాగా నగరం మధ్యలోనే ఈ లే అవుట్ ఉండడంతో మంచి డిమాండ్ ఉంటుందనే అంచనాతో ప్లాట్లు చేస్తున్నారు. 2019లో ఉప్పల్ భగాయత్లోని హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన లే అవుట్లోని ప్లాట్లకు గజం రూ.50 వేల నుంచి రూ.70వేల వరకు పలికింది. ప్రస్తుతం హైదరాబాద్లో రియల్ మార్కెట్ జోరు మీదుండడంతో అంతకుమించి ధర రావడం ఖాయమని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ లే అవుట్ పూర్తి వివరాలను హెచ్ఎంఆర్ గోప్యంగా ఉంచుతున్నది. పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసిన తర్వాతే వివరాలు వెల్లడించి విక్రయించాలని నిర్ణయించినట్లు తెలిసింది.
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కోసం ప్రభుత్వం ఉప్పల్ భగాయత్లో సుమారు 104 ఎకరాలను కేటాయించింది. ఇందులో కొంత భూమిని మెట్రో రైలు డిపో, ఇతర కార్యకలాపాల కోసం వాడగా మిగిలిన భూమిలో ప్రీ కాస్ట్ యార్డ్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇందులో 2012 నుంచి మైట్రో రైలు ప్రాజెక్టుకు అవసరమైన వయాడక్ట్లు, ఇతర ప్రీకాస్ట్ ఉత్పత్తులను తయారు చేశారు. 2020 నాటికే ఈ పనులన్నీ పూర్తి కావడంతో ప్రస్తుతం 41 ఎకరాల స్థలం ఖాళీగా ఉంది. ఈ స్థలం హెచ్ఎండీఏ అభివృద్ధి చేసిన ఉప్పల్ భగాయత్ లే అవుట్కు ఆనుకొని ఉంది. మొదటి దశలో 20 ఎకరాల్లో 200, 300, 500 గజాల్లో ప్లాట్లు ఉండేలా లే అవుట్ను రూపొందిస్తున్నారు.
నాగోల్-ఉప్పల్లోని మెట్రో రైలు డిపో, మెట్రోస్టేషన్కు ఇరువైపులా ఉన్న ఉప్పల్ భగాయత్లో హెచ్ఎండీఏ లే అవుట్ చేసింది. అనేక మౌలిక వసతులు కల్పించింది. వీటికి తోడు మెట్రో రైలు దగ్గర, మూసీ వెంట మూడు కిలోమీటర్ల మేర పార్కును అభివృద్ధి చేసింది. అంతేకాక నాగోల్ మూసీ బ్రిడ్జి నుంచి ఉప్పల్ భగాయత్ లే అవుట్ మీదుగా బోడుప్పల్ చేరుకునేందుకు ప్రత్యామ్నాయంగా రహదారిని అందుబాటులోకి తీసుకువచ్చింది. అనంతరం 2019లో ఆ ప్లాట్లను విక్రయానికి పెట్టింది. పూర్తిస్థాయి మౌలిక వసతుల కల్పన జరగడంతో మంచి ధర పలికాయి. ప్రస్తుతం అక్కడ జోరుగా నిర్మాణాలు సాగుతున్నాయి.
ఇలా ఉప్పల్ భగాయత్లో ఎన్నో అనుకూలతలు ఉండటంతో హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తమ 41 ఎకరాలను లే అవుట్ చేసి విక్రయించాలని నిర్ణయించింది. దీనికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో ప్రస్తుతం ఆ పనులు చురుగ్గా సాగుతున్నాయి. అభివృద్ధి చేసిన లే అవుట్లో ప్లాట్లను ఆన్లైన్లో విక్రయించేందుకు హెచ్ఎంఆర్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా ఇటీవలే కోకాపేట, ఖానామెట్ ప్రాంతాల్లో విక్రయించిన ప్రభుత్వ భూములకు మంచి ధర రావడంతో అదే తరహాలో ఉప్పల్ భగాయత్లోనూ అదేస్థాయి డిమాండ్ ఉంటుందనే అంచనాలో అధికారులు ఉన్నారు.