కొవిడ్ మహమ్మారి.. లాక్డౌన్.. ఇవేవీ హైదరాబాద్ ఐటీ రంగంపై కించిత్తు ప్రతికూల ప్రభావాన్ని చూపలేకపోయాయి. అంతర్జాతీయ ఐటీ కంపెనీలకు సైతం సురక్షిత మజిలీగా మారిన హైదరాబాద్లో ఈ విపత్తులోనూ పుష్కలమైన కొత్త ఉద్యోగాలు వచ్చాయి. బడా కంపెనీలు మొదలు చిన్నస్థాయి కంపెనీల వరకు గత ఏడాదిన్నరగా ‘ఫైర్’ (ఉద్యోగం నుంచి తొలగించడం) అనే పదమే వినిపించడం లేదు. అదే సమయంలో కంపెనీలుపెద్దఎత్తున కొత్త వారికి ఉద్యోగావకాశాలు సైతం కల్పించాయి.ఇదే వాస్తవాన్ని మాన్స్టర్ డాట్కామ్ తన తాజా నివేదికలో వెల్లడించింది.
కరోనా అన్ని రంగాలను అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. కానీ ఐటీ రంగంలో మాత్రం దాని ప్రతికూల ప్రభావం లేకపోవడం విశేషం. దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో జాబ్ మార్కెట్లో వృద్ధి నమోదు అయినట్లుగా పలు నివేదికల్లోనూ వెల్లడైంది. ఇదే క్రమంలో తాజాగా మాన్స్టర్ డాట్కామ్ నివేదికలోనూ దేశవ్యాప్తంగా గత ఏడాది సెప్టెంబర్తో పోలిస్తే ఇప్పుడు 44 శాతం వృద్ధి నమోదైనట్లుగా తేలింది. ఇందులో ప్రధానంగా ఐటీ రంగానికి పట్టుకొమ్మలా మారిన హైదరాబాద్లోనూ పుష్కలమైన కొత్త ఉద్యోగాలు లభించినట్లుగా నివేదికలో స్పష్టం చేశారు.
వాస్తవానికి గతంలో ఐటీ రంగం అంటే బెంగళూరు, ఇతర నగరాలు గుర్తొచ్చేవి. తెలుగు రాష్ర్టాల నుంచి కూడా చాలా మంది నైపుణ్యం ఉన్న వారు పొరుగు మెట్రో నగరాల్లో ఉద్యోగాల కోసం వెళ్లేవారు. కానీ గత ఆరేడు సంవత్సరాలుగా హైదరాబాద్ ఐటీ రంగంలో విప్లవాత్మక పురోగతి కనిపిస్తుంది. అనేక విభాగాల్లో హైదరాబాద్ మహానగరం బెంగళూరును వెనక్కి నట్టినట్లుగా అనేక నివేదికల్లో వెల్లడైంది. దీంతో మంచి నైపుణ్యం ఉన్న కోర్సులు చేసిన వారికి హైదరాబాద్ ఐటీలోనే పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయి.
ఇదే విషయం తాజాగా మాన్స్టర్ డాట్కామ్ నివేదికలోనూ ప్రస్ఫుటమైంది. 2021 ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి హైదరాబాద్ ఐటీ రంగంలో 6 లక్షల మంది ఉద్యోగులు ప్రత్యక్షంగా పని చేస్తున్నారు. రానున్న కొన్ని సంవత్సరాల్లోనే ఈ సంఖ్య పది లక్షల మార్కును దాటనున్నది. ఒక్క టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్లోనే ఏకంగా 62వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది సెప్టెంబర్తో పోలిస్తే ఈ ఏడాది కొత్త ఉద్యోగాల కల్పన అనేది గణనీయంగా పెరిగి… 20 శాతం వృద్ధి నమోదైంది.
డిజిటల్ టెక్నాలజీ నైపుణ్యాలకు ఇప్పుడు ఐటీ రంగంలో భారీ డిమాండ్ ఉన్నట్లు హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా) అధ్యక్షుడు భరిణి కె ఆరోల్ తెలిపారు. ఈ నైపుణ్యాలు ఉన్న వారికి ఉద్యోగావకాశాలు గతంలో 8 శాతం ఉండగా… ఈ సంవత్సరం 25 శాతానికి పెరిగినట్లు కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులను నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు చెప్పారు.