ఖైరతాబాద్, ఆగస్టు 27 : గంగ తెప్పొత్సవాలు ఈ నెల 29న పీవీ నరసింహారావు మార్గ్ గంగమ్మ గుడి వద్ద నిర్వహించనున్నట్లు తెలంగాణ గంగ తెప్పోత్సవ కమిటీ అధ్యక్షుడు మల్కు మహేందర్ బాబు తెలిపారు. ఖైరతాబాద్లోని హెచ్ఎండీఏ మైదానంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్సవాల వివరాలను వెల్లడించారు. గంగపుత్రుల ఆరాధ్యదైవమైన గంగమ్మ తల్లి ప్రతి ఏడాది కొలుస్తామని, ఈ సందర్భంగా ప్రతి ఏడాది తెప్పోత్సవాలు సంప్రదాయంగా నిర్వహిస్తామన్నారు.
ఈ సంవత్సరం కూడా అదే పరంపరను కొనసాగిస్తూ తొలుత ఖైరతాబాద్లో ఏడుగుళ్ల వద్ద నుంచి రెండు వేల మందితో శోభాయాత్ర నిర్వహిస్తామని, ఈ యాత్ర ఉదయం 10గంటలకు బయలుదేరుతుందని, మధ్యాహ్నం గంగమ్మ దేవాలయానికి చేరుకుంటుందన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు హాజరవుతున్నారని తెలిపారు.
ఈ సమావేశంలో కమిటీ ప్రధాన కార్యదర్శి పూస నర్సింహా, ఉపాధ్యక్షుడు మంగళపల్లి రాజు, కమిటీ సభ్యులు మామిడి సురేశ్ కుమార్, చందు, సాయి, గిరి బాబు, హనుమంతు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.