హైదరాబాద్ : నగరాల్లోని చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చి ఆదుకునేందుకు ప్రవేశ పెట్టిన పీఎం స్వనిధి మైక్రో క్రెడిట్ స్కీమ్ అమలులో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దేశంలోని ఇతర నగరాల కన్నా జీహెచ్ఎంసీ అగ్రస్థానంలో నిలిచింది. ఈ పథకం ద్వారా ఒక్కొక్క చిరు వ్యాపారికి రూ.10వేల తక్షణ సాయం అందించడంలో భాగంగా రికార్డు స్థాయిలో 34,878 మందికి అందించి మన నగరం మొదటి స్థానంలో ఉంది. 2020 జూలై 2న ఈ పథకం ద్వారా రుణాలు ఇచ్చే ప్రక్రియ మొదలైంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు జీహెచ్ఎంసీ పరిధిలో 1,62,105 మంది చిరు వ్యాపారులను గుర్తించగా, వీరిలో 1,57,945 మంది వివరాలను మెప్మా పోర్టల్లో అప్లోడ్ చేశారు. ఇందులో 1,54,335 మంది చిరు వ్యాపారులకు గుర్తింపు కార్డులను జారీ చేశారు.
వీరిలో ఒక్కొక్కరికి రూ.10వేలు తక్షణ సాయం అందించేందుకు దరఖాస్తులను ఆహ్వానించగా 67,233 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో పూర్తి స్థాయిలో విచారణ జరపగా అర్హులైన 42,911 మందికి రుణాలు మంజూరు కాగా, నేటి వరకు 34,878 మందికి రుణాలను అందించడం ద్వారా దేశంలోని ఇతర నగరాలకన్నా గ్రేటర్ హైదరాబాద్ అగ్ర స్థానంలో నిలిచింది. హైదరాబాద్ తర్వాత రెండో స్థానంలో ఇండోర్ నగరం 34855 మంది చిరు వ్యాపారులకు రుణాలను అందించింది.
అమలులో అధికారుల కృషి..
పీఎం స్వనిధి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయిలో పలు సమావేశాలు జరిగాయి. జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రతివారం జోనల్, డిప్యూటీ కమిషనర్లతో ప్రత్యేక సమీక్షలు నిర్వహించి ఈ రుణాలు అందేలా బ్యాంకర్లతో సంప్రదింపులు చేశారు. ఈ పథకం అమలు చేయడంలో మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్, పురపాలక శాఖ కమిషనర్, మెప్మా ఎండీ. డా.సత్యనారాయణ ప్రత్యేకంగా కృషి చేశారు. నగరంలో పీఎం స్వనిధి అమలు తీరును కూడా కేంద్ర ప్రభుత్వ సంయుక్త కార్యదర్శి ప్రత్యేకంగా పరిశీలించారని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.