‘కరోనా రావద్దంటే ఇవి తినండి, ఇలా చేయండి.. ’ అంటూ రోజూ సోషల్ మీడియాలో అనేక అసత్య వార్తలు వైరల్ అవుతున్నాయి. వాటిలో మందుబాబులకు ‘కిక్కి’చ్చే వార్తలూ ఉంటున్నాయి. మద్యపానం వల్ల కరోనా సోకదంటూ ప్రచారమైన ఓ తప్పుడు వార్తకు చాలా లైకులే వచ్చాయి. అయితే ఈ ప్రచారంలోఎలాంటి నిజం లేదనీ, మద్యం ఆరోగ్యాన్ని చెడగొడుతుందే తప్ప కరోనాను అరికట్టలేదని తేల్చి చెబుతున్నారు పంజాబ్ ఎక్స్పర్ట్స్ కమిటీ ఆన్ కొవిడ్ అధ్యక్షుడు డాక్టర్ కె.కె. తల్వార్. నిజానికి మద్యం ఎక్కువగా సేవిస్తే శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గుతుందని, దానివల్ల త్వరగా వైరస్ బారినపడే అవకాశాలు ఎక్కువవుతాయనీ హెచ్చరిస్తున్నారు. ‘నిరక్షరాస్యులతోపాటు చదువుకున్నవాళ్లు కూడా సోషల్ మీడియా వార్తలను గుడ్డిగా నమ్మడం ఆశ్చర్యం. కొందరైతే ఎవరు ఏది చెప్తే అది పాటిస్తున్నారు. ఇంకొందరైతే వైన్ కడుపులోకి వెళ్తే, శరీరంలో తిష్ఠవేసిన వైరస్ చనిపోతుందని ప్రకటనలు ఇచ్చేస్తున్నారు. వీటిని నమ్మి ఎవరైనా లిక్కర్ పుచ్చుకుంటే, దీర్ఘకాలంలో ఏ లివర్ సమస్యతోనో ఇబ్బంది పడటం ఖాయం’ అని తీవ్రస్వరంతో చెబుతున్నారు డాక్టర్ తల్వార్. ఆయన గతంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్) డైరెక్టర్గా పనిచేశారు.