మేడ్చల్, సెప్టెంబర్29(నమస్తే తెలంగాణ): ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ సర్కారు దవాఖానల్లో వసతులను మెరుగుపర్చి పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా గురువారం మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ దవాఖాన, డెకాథ్లాన్, బై సైక్లింగ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్, ఫిటినెస్ 9 సంస్థల ఆధ్వరంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో సైకిలింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యమనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. గుండె ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరూ రోజూ యోగా, వాకింగ్, సైక్లింగ్ చేయాలని సూచించారు.
సైకిలింగ్లో పాల్గొన్న మంత్రి
వర్డల్ హార్డ్డే సందర్భంగా నిర్వహించిన సైకిలింగ్లో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. 2వేల మంది మెడికల్ విద్యార్థులు, గుండె సంబంధిత వ్యాధులనుంచి బయట పడ్డవారితో కలిసి మంత్రి డెకాథ్లాన్ నుంచి కొంపల్లి సినీ ప్లానెట్ వరకు సైకిల్పై ప్రయాణం చేశారు. సైకిలింగ్ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను మంత్రి వివరించారు. అనంతరం వేదికపై ఆటాపాటలతో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ డాక్టర్ భద్రారెడ్డి మాట్లాడుతూ గుండె వ్యాధులపై అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించామని అన్నారు.కార్యక్రమంలో ఎంఎల్ఆర్ కళాశాలల చైర్మన్ లక్ష్మారెడ్డి, డెకాథ్లాన్ యాజమాన్యం, వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.