మెహిదీపట్నం, జూన్ 30 : నగరానికి పెద్ద పండుగొచ్చింది. ఆషాఢమాసం ఆధ్యాత్మిక ఉత్సవాన్ని మోసుకొచ్చింది. అమ్మవారికి బోనం అందించేందుకు నగరం సిద్ధమైంది. చారిత్రక గోల్కొండ కోటలో కొలువైన జగదాంబిక ఎల్లమ్మతల్లికి గురువారం తొలిబోనం సమర్పించేందుకు లంగర్హౌస్ చౌరస్తాలో కళా బృందాలు, పోతురాజుల విన్యాసాలతో వైభవంగా ఊరేగింపు ప్రారంభించారు. భక్తులు వేల సంఖ్యలో హాజరై అమ్మవారి దర్శనం చేసుకుని బోనాలను సమర్పించారు.
పట్టు వస్ర్తాల సమర్పణ..
దేవాదాయ శాఖ తరపున మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎంపీ రవిచంద్ర, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి, దేవాదాయ కమిషనర్ అనిల్కుమార్లు పట్టు వస్ర్తాలను లంగర్హౌస్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక రథంలో పూజారులకు అందచేశారు. అనంతరం మంత్రులు తొట్టెలకు పూజలు చేశారు. దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, ఈవో శ్రీనివాస్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పోతురాజులతో కలిసి నృత్యం చేసి అందరినీ అలరించారు.
ఊరేగింపు ఇలా..
లంగర్హౌస్ చౌరస్తా నుంచి ప్రారంభమైన ఊరేగింపు మార్కెట్ మీదుగా గోల్కొండ ఛోటా బజార్కు చేరుకున్న తర్వాత అక్కడ దిగంబర్ పంతులు ఇంట్లో జగదాంబిక ఎల్లమ్మ ఉత్సవ విగ్రహాలకు పూజలు చేశారు. అనంతరం అనంతచారి పూజారి ఇంటి నుంచి ఆభరణాలను తెచ్చి అమ్మవారికి అలంకరించి అక్కడి నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయం వరకు ఊరేగించారు. అనంతచారి ఇంట్లో అమ్మవారికి ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్. ప్రభాకర్ రావు సతీసమేతంగా పూజలు చేశారు. కోటపై అమ్మవారి ఆలయంలో తొట్టెల సమర్పణతో బోనాల మొదటి పూజ వైభవంగా ముగిసింది.
కల్లు సాక..
తొట్టెల ఊరేగింపు ప్రారంభానికి ముందు లంగర్హౌస్ గౌడ సంఘం ఆధ్వర్యంలో బోనాలకు కల్లుసాకను సమర్పించారు. సంఘ సేవకులు సిరుగుమల్లె రాజు వస్తాద్, ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్, కార్వాన్, నాంపల్లి నియోజకవర్గాల టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జిలు ఠాకూర్ జీవన్సింగ్, ఆనంద్కుమార్గౌడ్, మాజీ కార్పొరేటర్లు ఉదయ్కుమార్, బంగారి ప్రకాశ్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు శేఖర్రెడ్డి, కావూరి వెంకటేశ్, మాజీ చైర్మన్లు బాలప్రసాద్ తివారి, కోయల్కార్ గోవింద్రాజ్ తదితరులు పాల్గొన్నారు.
బంగారు బోనం
చాంద్రాయణగుట్ట, జూన్ 30 : గోల్కొండ జగదాంబదేవి అమ్మవారికి భాగ్యనగర్ ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారీ ఆధ్వర్యంలో గురువారం బంగారు బోనం, ఒడిబియ్యం, పట్టు వస్ర్తాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మీరాలంమండి మహాకాళేశ్వరస్వామి దేవాలయం చైర్మన్ గాజుల అంజయ్య, మధుసూదన్ యాదవ్, ఆలె భాస్కర్రాజ్, కె.విష్ణుగౌడ్, అదర్ల మహేశ్, సీ.రాజ్కుమార్ యాదవ్, కే.ఎస్.ఆనంద్రావు తదితరులు పాల్గొన్నారు.
గంగాజమున తెహజీబ్
మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్
బోనాల పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించటమే కాకుండా అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుదని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోల్కొండ బోనాలను ప్రారంభించిన సందర్భంగా లంగర్హౌస్ చౌరస్తాలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, ఎమ్మెల్సీ ఎల్. రమణ, మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, దేవాదాయ కమిషనర్ అనిల్కుమార్, గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మ ఆలయ ట్రస్టు చైర్మన్ వావిలాల మహేశ్వర్తో కలిసి తొలిపూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ బోనాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ రూ. 15 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ బోనాలకు అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు.హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ నగరంలో బోనాల పండుగను హిందూ, ముస్లింలు కలిసి చేసుకుంటూ గంగాజమున తెహజీబ్ను నిరూపిస్తున్నారని అన్నారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రజలందరూ కరోనా నిబంధనలతో బోనాలను జరుపుకోవాలని సూచించారు. కాగా గోల్కొండ జగదాంబిక ఎల్లమ్మకు కులవృత్తుల వారి ఆధ్వర్యంలో నజర్ బోనం సమర్పించారు.
భారీ బందోబస్తు
బోనాల పండుగకు పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ సీవీ, అదనపు సీపీ చౌహాన్, వెస్ట్జోన్ డీసీపీ జోయెల్ డేవిస్, ట్రాఫిక్ డీసీపీ కరుణాకర్, ఇక్బాల్ సిద్ధికీ, ఆసిఫ్నగర్ ఏసీపీ ఆర్జీ, శివమారుతితో కలిసి సీపీ లంగర్హౌస్ క్రాస్ రోడ్డు నుంచి గోల్కొండ వరకు రూట్ను పరిశీలించారు. బోనాల పండుగకు 800 మంది సిబ్బందితో పాటు 8 టీఎస్ఎస్పీ ప్లాటూన్స్, మహిళా సిబ్బంది, షీ టీమ్స్తో బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.