సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. దాదాపు తొమ్మిది గంటల తర్వాత ఆందోళన కారుల నుంచి స్టేషన్ను పూర్తిగా అదుపులోకి తీసుకున్నట్లు డీఆర్ఎం ఏకే గుప్తా తెలిపారు. సాయంత్రం 6.30 గంటల తర్వాత స్టేషన్లో పూర్వ పరిస్థితి నెలకొందని వివరించారు. ఆందోళనకారులు స్టేషన్లోని మూడు రైళ్లకు సంబంధించి నాలుగు బోగీలకు నిప్పు పెట్టారని.. ఈ ప్రమాదం నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని తెలిపారు. అజంతా రెండు బోగీలు, రాజ్కోట్ ఒకటి, ఈస్ట్కోస్ట్కు చెందిన బోగీలు ధ్వంసం కాగా.. ఇందులోని పార్సిళ్లు పూర్తిగా కాలిపోయాయన్నారు.
రూ.7 కోట్ల నష్టం..
సికింద్రాబాద్లో ఆర్మీ ఉద్యోగార్థులు సృష్టించిన విధ్వంసంతో దాదాపు రూ.7 కోట్ల నష్టం వాటిల్లిందని డీఆర్ఎం ధ్రువీకరించారు. నిరసనకారులు నాలుగు బోగీలను ధ్వంసం చేయడంతో పాటు అందులోని సరకును కాల్చేశారని అన్నారు. అలాగే ఫర్నిచర్, సీసీ కెమెరాలను పగలగొట్టడంతో మొత్తం రూ.7 కోట్ల నష్టం వాటిలినట్లు అంచనా వేశామని వివరించారు.
గంటల్లోనే రైళ్ల పునరుద్ధరణ..
ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్న రైల్వే పోలీసులు గంటల్లోనే రైళ్ల రాకపోకలను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ఆయా ట్రాకుల ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.
భద్రత కట్టుదిట్టం..
సికింద్రాబాద్ ఘటన నేపథ్యంలో నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లు ఎస్సీఆర్ సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. టికెట్ ఉన్న వారినే లోపలికి అనుమతిస్తున్నట్లు తెలిపారు. అలాగే శివారులోని మౌలాలి, చర్లపల్లి స్టేషన్లలోనూ రక్షణ చర్యలు చేపట్టామన్నారు.
రైల్వే మంత్రిత్వ శాఖ ఆరా
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళనలపై రైల్వే మంత్రిత్వ శాఖ ఎప్పటికప్పుడు ఆరా తీసింది. విధ్వంసంపై చర్యలు చేపట్టాలని సూచనలు చేయగా దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు.
నాంపల్లిలో భద్రత కట్టుదిట్టం
తెలుగుయూనివర్సిటీ, జూన్ 17: అగ్నిపథ్కు వ్యతిరేకంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నాంపల్లి రైల్వేస్టేషన్లో భారీ భద్రతను పెంచారు. డీసీపీ సునీత నేతృత్వంలో సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులతో పాటు ఆర్పీఎఫ్, సీఆర్పీఎఫ్ దళాలతో భద్రతను కట్టుదిట్టం చేశారు. మరోవైపు నాంపల్లిలో పలు రైళ్లను నిలిపివేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
మౌలాలిలో పర్యటించిన సీపీ..
గౌతంనగర్, జూన్ 17: మౌలాలి రైల్వేస్టేషన్ను రాచకొండ కమిషనర్ మహేశ్ భగవత్, డీసీపీ రక్షిత కృష్ణమూర్తిలు పరిశీలించారు. రైల్వే అధికారులతో మాట్లాడి బందోబస్తు పెంచారు. అనంతరం వారు మాట్లాడుతూ రాచకొండ పరిధిలోని మౌలాలి, చర్లపల్లి, మల్కాజిగిరి, దయానంద్నగర్, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి స్టేషన్లతో పాటు మెట్రోస్టేషన్లలోనూ భద్రతను పెంచి ప్రత్యేకంగా తనిఖీలు చేపట్టామన్నారు. ఆందోళన చేస్తున్న యువకులు తమ డిమాండ్లను ప్రజాస్వామ్యంగా నెరవేర్చుకోవాలని.. ఆస్తులను ధ్వంసం చేయవద్దని సూచించారు.
పాతబస్తీలో అప్రమత్తం..
చాంద్రా యణగుట్ట, జూన్ 17: సికింద్రాబాద్లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో పాతబస్తీలోని ఉప్పుగూడ, ఫలక్నుమా, డబీర్పురా, యాకత్పురా రైల్వేస్టేషన్లలో రైల్వే పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఛత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలాని ఉప్పుగూడ రైల్వేస్టేషన్ను పరిశీలించారు. టికెట్ కౌంటర్తో పాటు డ్యూటీలో ఉన్న రైల్వే పోలీసులతో చర్చించారు. రైళ్లు రైద్దెనందున ఎవరిని స్టేషన్లోకి అనుమతించవద్దని సూచించారు.