సిటీబ్యూరో/సుల్తాన్బజార్, మే 12 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ దవాఖానల్లో ఖర్చుకు వెనుకాడకుండా మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని మేయర్ విజయలక్ష్మి అన్నారు. కోఠి ప్రసూతి దవాఖాన, ఎంఎన్జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ ప్రాంతీయ క్యాన్సర్ సెంటర్లో మూడు పూటల భోజనం పథకాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ప్రారంభించారు. అనంతరం ఇంటర్నేషనల్ నర్సింగ్ దినోత్సవం సందర్భంగా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి నర్సింగ్ స్టాఫ్తో కలిసి కేక్ను కట్ చేశారు. ఈ కార్యక్రమంలో కోఠి ప్రసూతి హాస్పిటల్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, ఎంఎన్జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ రీజనల్ క్యాన్సర్ హాస్పిటల్ డైరెక్టర్ జయలత తదితరులు పాల్గొన్నారు.
నిమ్స్ దవాఖానలో…
ఖైరతాబాద్, మే 12: నిమ్స్ దవాఖానలో మూడు పూటల భోజన పథకాన్ని ఎమ్మెల్యే దానం నాగేందర్ గురువారం డైరెక్టర్ డాక్టర్ కె. మనోహర్, డీన్ రామ్మూర్తి, లైజనింగ్ అధికారి డాక్టర్ మార్త రమేశ్తో కలిసి ప్రారంభించారు.
కింగ్కోఠి జిల్లా దవాఖానలో…
సుల్తాన్బజార్, మే 12 : తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింగ్ కోఠి జిల్లా దవాఖానలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, టీవీవీపీ కమిషనర్ అజయ్కుమార్, దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్తో కలిసి రూ. 5 భోజన పథకాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గన్ఫౌండ్రి కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓం ప్రకాశ్ భీష్వ, టీఎస్ఎం ఎస్ఐడీసీ ఏఈ అశోక్ పాల్గొన్నారు.
నల్లకుంట ఫీవర్ దవాఖానలో
ప్రభుత్వ దవాఖానల్లో చికిత్స పొందడానికి వచ్చే రోగుల సహాయకులకు మూడు పూటల భోజనం పథకాన్ని నల్లకుంట ఫీవర్ దవాఖానలో గురువారం దవాఖాన సూపరింటెండెంట్ డా.కె.శంకర్, గోల్నాక కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్తో కలిసి ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన ఆర్ఎంవో విజయలక్ష్మి, డాక్టర్ సునీల్, ఫార్మాసిస్టు జె.అశోక్, టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్, చంద్రమోహన్, భాస్కర్గౌడ్, అరుణ్రెడ్డి, ధనుంజయ, ఆర్కేబాబు, రాము తదితరులు పాల్గొన్నారు.
నిలోఫర్ దవాఖానాలో…
నిలోపర్ దవాఖానాలో రోగి సహాయకులకు మూడు పూటల భోజన పథకాన్ని శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిలోఫర్ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మురళీకృష్ణ, నాంపల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ ఇన్చార్జ్ సీహెచ్ ఆనంద్కుమార్ గౌడ్, తెలంగాణ వైద్యుల సంఘం నాయకులు డాక్టర్ లాలూప్రసాద్ రాథోడ్, డాక్టర్ దంపూరి రమేశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సరోజినీదేవి కంటి దవాఖానలో
మెహిదీపట్నం మే 12: మెహిదీపట్నం సరోజినీదేవి కంటి దవాఖానలో ఏర్పాటు చేసిన మూడు పూటల భోజన కార్యక్రమాన్ని గురువారం ఎమ్మెల్సీ సురభివాణిదేవి, టీఎస్ఎంఐడీసీ ఎండీ డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సరోజినిదేవి కంటి దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజలింగం, ఆర్ఎంవో నజాఫీబేగంతో కలిసి ప్రారంభించారు.
మా కడుపు నింపారు
మాది వనపర్తి జిల్లా. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా. నా కొడుకుకు పదిహేను రోజుల క్రితం యాక్సిడెంట్ జరిగింది. చికిత్స కోసం నిమ్స్ దవాఖానలో చేర్పించారు. నా భార్య నేను వంతుల వారీగా కొడుకుకు సహాయంగా ఉంటున్నాం. రాత్రి వేళలో భార్య కొడుకు వద్ద ఉంటే… నేను నిమ్స్ ఆవరణలోనే నిద్రిస్తున్నాను. రోజూ ఒక్క పూటే రూ. 5 భోజనం తింటూ కాలం గడుపుతున్నాం. ఈ రోజు నుంచి మూడు పూటల భోజనం పెట్టి ప్రభుత్వం మా కడుపునింపారు.
– తిరుపతయ్య, రైతు, వనపర్తి
భోజనం బాగుంది
దవాఖానల అన్నం దొరకాలంటే చాలా కష్టం అవుతుంది. బయటకు వెళ్లి తినాలంటే ఖర్చుతో కూడుకున్న పని. ప్రజల కష్టాలను గుర్తించి వారికి అన్నం ఇవ్వడం చాలా బాగుంది. రోడ్లపైన దొరికే భోజనాల కన్నా ఇక్కడ హాస్పిటల్లో ఇస్తున్న భోజనం ఎంతో బాగుంది.
-బాలమ్మ, జడ్చర్ల
వారం తర్వాత కడుపునిండా తిన్నాం..
దవాఖాన్లకు వచ్చే మాలాంటి పేదోళ్లు అరకొర డబ్బులతో వచ్చి ఇబ్బందులు పడుతున్నాం. వారం రోజులుగా ఇక్కడే ఉంటున్న. ఊరు కాని ఊరు.. ఇక్కడ మా కడుపు చూసేటోళ్లు లేరు. మాలాంటి పేదల కడుపును నింపాలి. తెలంగాణ ప్రభుత్వం చొరవతో వారం రోజుల తర్వాత మంచిగా అన్నం తింటున్నాం. ఆస్పత్రులలో భోజనాలను అందించడం గొప్ప విషయం.
– వాలి, నాగార్జున సాగర్