కుత్బుల్లాపూర్, మే 12 : ప్రజలకు మెరుగైన సదుపాయాలను కల్పించేందుకు ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ నిరంతరం పాటుపడుతున్నారు. ఏండ్ల తరబడి నాలా పరివాహక ప్రాంతాల ప్రజల ఇబ్బందులను అధిగమించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల ప్రాంతాల్లో రాబోయే వర్షాకాలం నాటికి వరద ముంపు సమస్య తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన నాలా అభివృద్ధి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.
ఆ కాలనీల్లో సమస్యకు పరిష్కారం…
శివారెడ్డినగర్ కాలనీలో కొనసాగుతున్న నాలా వంతెన నిర్మాణం పూర్తయితే కాలనీకి ఆనుకొని ఉన్న న్యూవివేకానందనగర్, శ్రీనివాస్నగర్, సాయినగర్, వాజ్పేయ్నగర్ కాలనీ వాసులు నేరుగా కుత్బుల్లాపూర్ ప్రధాన రోడ్డుకు రావాల్సి వస్తే మార్గం సుగమంగా మారుతుంది. మరో పక్క ఉన్న వెంకన్నహిల్స్ కాలనీకి వెళ్లాలంటే శివారెడ్డి నగర్ కాలనీ వంతెన మార్గం చాలా అనువుగా ఉంటుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కొనసాగుతున్న పనులు…
రూ.45 లక్షలతో సాగుతున్న నాలా వంతెన నిర్మాణ పనులను కొన్ని రోజుల నుంచి ముమ్మరంగా చేస్తున్నారు. రాబోయే వర్షాకాలం నాటికి పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాలాపై సాగుతున్న వంతెన నిర్మాణం సగభాగంలో బెడ్డు పనులు పూర్తి కాగా మరో వైపు పనులు త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధం చేసుకున్నారు.