కేపీహెచ్బీ కాలనీ, మార్చి 28 : అతిగా మద్యంతాగి విచ్చలవిడిగా వాహనాలను నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరు గుతున్నాయి.. ఈ ప్రమాదాల్లో వాహనాలు నడిపిన వారితోపాటు సంబంధం లేని వ్యక్తులు సైతం ప్రాణాలు కోల్పోతుండగా.. మరి కొందరు తీవ్ర గాయాలపాలవుతు న్నారు. ఈ క్రమంలో మద్యం మత్తులో జరుగుతున్న ఈ ప్రమాదాలను అరికట్టే దిశగా నిర్వహిస్తున్న డ్రండ్ అండ్ డ్రైవ్లు పోలీసుల ప్రాణాలనే హరించేలా ఉన్నా యి. తాజాగా నిజాంపేట రోడ్డులో నిర్వహించిన డ్రండ్ అండ్ డ్రైవ్లో అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తి తనిఖీలకు భయపడి పారిపోయే ప్రయత్నంలో పోలీసులను ఢీకొట్టగా హోంగార్డుకు, మరో ఇద్దరు గాయాలపాలయ్యారు. ఘటనా స్థలంలో వివరాలు సేకరిస్తున్న ఏఎస్ఐని మరో కారు ఢీ కొట్టడంతో అతని తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ ఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం రాత్రి చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం… శనివారం రాత్రి నిజాంపేట రోడ్డు కొలన్ రాఘవరెడ్డి ఫంక్షన్ హాల్ సమీపంలో పోలీసులు రాజ్కుమార్, ద్రాక్షని, రెహమత్అలీ, ప్రహ్లాద్ బృందం డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి 11.40 గంటల సమయంలో బాచుపల్లికి చెందిన మాజీ సాఫ్ట్వేర్ ఉద్యోగి సృజన్.. స్నేహితుడు పవన్తో కలిసి మద్యం తాగి.. మరో స్నేహితుడిని కలవడం కోసం క్రెటా( టీఎస్ 03 ఈజెడ్ 9119)లో నిజాంపేట బాచుపల్లి వైపు వెళ్తున్నాడు. తనిఖీల్లో భాగంగా పోలీసులు ఆ కారును ఆపి వారికి బ్రీత్ ఎనలైజర్తో తనిఖీ చేయగా 170ఎంజీ/100 పాయింట్లు వచ్చాయి.
అతిగా మద్యం తాగినట్లు తేలడంతో.. సృజన్ తప్పించుకునే క్రమంలో కారుతో ట్రాఫిక్ హోంగార్డు ప్రహ్లాద్ను ఢీ కొట్టాడు.. అదే వేగంతో మరో కారును ఢీ కొట్టడంతో పాటు ఇక్కడే నిలుచుని ఉన్న తనూజ, సీతారామశాస్త్రీలను ఢీకొట్టాడు. దీంతో హోంగార్డు ప్రహ్లాద్తోపాటు వారిద్దరికి తీవ్ర గాయాలయ్యా యి. వారిని సమీపంలోని వైద్యశాలకు తరలించారు. కారు నడిపిన సృజన్ కారును పక్కనపెట్టి అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ ఘటనను సైబరాబాద్ కంట్రోల్ బోర్డుకు సమాచారం ఇవ్వడంతో కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్కు చెందిన ఏఎస్ఐ మహిపాల్రెడ్డి, దామోదర్రెడ్డిలు రాత్రి 12.10 గంటల సమయంలో ఘటనా స్థలానికి వచ్చి వివరాలను సేకరిస్తున్నారు.
అదే సమయంలో కేపీహెచ్బీ కాలనీ నుంచి బాచుపల్లి వైపునకు వెళ్తున్న క్యాబ్ (టీఎస్ 08 యూడీ 2984) డ్రైవర్ అస్లామ్ వేగంగా వస్తూ ఏఎస్ఐ మహిపాల్రెడ్డిని ఢీకొట్టగా అతను రోడ్డుపై పడిపోయాడు. తలకు, ఎడమ కాలుకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కేపీహెచ్బీ కాలనీ ఎస్సై సక్రమ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నారు.. పరారీలో ఉన్న సృజన్, అస్లామ్ల కోసం గాలిస్తున్నారు.