వెంగళరావునగర్, సెప్టెంబర్ 19: పాపం పండుటాకులు.. పదేండ్లుగా ఫుట్పాత్పైనే జీవనం సాగించారు ఆ వృద్ధ దంపతులు. ఆకలిదప్పులతో అలమటిస్తూ.. నిలువ నీడలేని ఆ వయో వృద్ధుల పట్ల పోలీసులు ఔదార్యం చూపారు. చుట్టుపక్కల వారిచ్చే మెతుకులతోనే ఇన్నాళ్లు బతుకు భారంగా గడుపుకొచ్చిన ఆ దంపతులకు వయోభారం మీదపడటంతో కదల్లేని నిస్సహాయస్థితికి చేరారు. వీరి దయనీయ పరిస్థితిని గమనించిన స్థానికులు విషయాన్ని ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ సైదులు దృష్టికి తీసుకొచ్చారు.
ఆ దంపతులు పడుతున్న బాధలను చూసి చలించిపోయిన ఇన్స్పెక్టర్ సైదులు వారికి బాసటగా నిలువాలని సంకల్పించారు. వయోవృద్ధులకు ఉచితంగా సేవ చేసే మేడిపల్లి లోని రాజమాతా స్వచ్ఛంద సేవా సంస్థ వారికి సమాచారం అందించారు. ఆటోను ఏర్పాటు చేసి.. ఆ వృద్ధ దంపతులిద్దర్నీ అక్కడికి పంపించారు. వారికి అక్కడ భోజన సదుపాయాలు ఉంటాయని, వేళకు మందులిచ్చి కాపాడుకుంటారని ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ సైదులు చెప్పారు. వృద్ధ దంపతులకు కాసింత నీడ కల్పించగలిగాననే సంతృప్తి తనకు మిగిలిందని పేర్కొన్నారు.