జంటనగరాల వారధి కిక్కిరిసి పోయింది..రెండువారాలుగా సందర్శకులకు ఆహ్లాదం పంచుతున్న చారిత్రక మార్గం మూడో ఆదివారం మరింత జోష్ నింపింది.. సికింద్రాబాద్ ఏవోసీకి చెందిన ఆర్మీ బృందం సంగీత వాయిద్యం అలరించింది..జానపద, ఒగ్గు కళాకారుల నృత్యాలు, డోలు వాయిద్యం హోరెత్తింది.. పొడవాటి మనుషుల పలకరింత, ట్రీ లైటింగ్తో ట్యాంక్బండ్కు మరింత ఆకర్షణ చేకూరింది. పురపాలక మంత్రి కేటీఆర్ ఆదేశాలతో హెచ్ఎండీఏఅధికారులు ఆదివారం ట్యాంక్బండ్పై చేసిన ఏర్పాట్లు సందర్శకులను మరింత మురిపించాయి. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పిల్లాపాపలతో నడుస్తూ హాయిగా సేదతీరారు. శిల్పారామం హస్తకళ, చేనేత ఉత్పత్తులు, విభిన్న రకాల ఆభరణాలు, ఆయుర్వేద స్టాళ్లు కొనుగోలుదారులతో కిటకిటలాడాయి. బంపర్స్, జంపర్స్, రంగుల రాట్నంలో ఆడిపాడి చిన్నారులు ఎంజాయ్ చేశారు. సన్డే-ఫన్డేకు తరలివచ్చిన సందర్శకులకు హెచ్ఎండీఏ వేలాది మొక్కలను ఉచితంగా అందజేసింది. దాదాపు 40వేల మందికి పైగా ట్యాంక్బండ్ను సందర్శించినట్లు
అధికారుల అంచనా.
దాదాపు గంటపాటు విద్యుత్కాంతుల ధగధగలతో చారిత్రక కట్టడాల ప్రదర్శన ఆకట్టుకుంది. చార్మినార్, గోల్కొండ, మక్కామసీదు, అసెంబ్లీ, ఫలక్నుమా ప్యాలెస్, రామోజీ ఫిల్మ్సిటీతోపాటు కార్టూన్ లేజర్షో మైమరిపించింది. లేజర్ కిరణాలతో ఇంద్రధనస్సు ప్రదర్శన అబ్బురపర్చింది. వందేమాతరం ఆలాపన దేశభక్తిని ఉప్పొంగించింది.
సుమారు గంట పాటు విద్యుత్ కాంతుల ధగధగలతో తొలుత హైదరాబాద్ చారిత్మ్రక వారసత్వ కట్టడాలను ప్రదర్శించారు. వీటిలో ప్రధానంగా చార్మినార్, గోల్కొండ, మక్కా మసీదు, అసెంబ్లీ, ఫలక్నుమా ప్యాలెస్, రామోజీఫిలింసిటీ, చిన్నారులకు నచ్చే డోరేమ్యాన్, లిటిల్ సింగం, మిక్కీమౌజ్ వంటి కార్టూన్లను ప్రదర్శించడంతో చిన్నారులు ఉత్సాహంగా తిలకించారు. చప్పట్లతో కేరింతలు కొడుతూ సందడిగా గడిపారు. అంతేకాకుండా లేజర్ కిరణాలతో ఆకాశంలో ఇంద్ర ధనస్సును ప్రదర్శించారు. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరినీ షో ఆకట్టుకున్నది. సందర్శకులు తమ సెల్ఫోన్లలో బంధించడానికి పోటీ పడ్డారు. లేజర్షోలో వందే మాతరం వంటి దేశ భక్తి గీతాలను ఆలపించారు.
నగరవాసుల సందడికి కేరాఫ్ అడ్రస్గా మారిన ట్యాంక్బండ్పై అదనపు హంగులు వచ్చి చేరాయి. ప్రభుత్వ సూచనల మేరకు హెచ్ఎండీఏ, పోలీస్ అధికారులు తాజాగా మరికొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశాలమైన ట్యాంక్బండ్పై ఏర్పాటైన స్టాల్స్, స్ట్రీట్ ఫర్నిచర్, ఫుడ్ కోర్టులకు నగరవాసులు ఫిదా అయ్యారు. పిల్లలు, పెద్దలు అన్న తేడా లేకుండా సందడి చేశారు.
ట్యాంక్బండ్ వేదికగా ఇండియన్ ఆర్మీ బ్యాగ్ పైపర్ బ్యాండ్ సంగీత ప్రదర్శన ఎంతగానో అలరించింది. సికింద్రాబాద్లోని ఏఓసీ సెంటర్ నుంచి 14మందితో కూడిన బృందం ట్యాంక్బండ్ చేరుకొని ప్రదర్శన ఇచ్చింది. ఇదే వేదికపై బీట్ బ్యాక్సింగ్ కార్యక్రమం అలరించింది.
సాగర తీరంలో ఎటు చూసినా చిన్నారుల సందడే కనిపించింది. వారికోసం నిర్వాహకులు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా బంపర్స్, జంపర్స్, రంగుల రాట్నాన్ని ఏర్పాటు చేయగా చిన్నారులు ఆడిపాడారు.
ప్రత్యేక వస్ర్తాధరణతో అతిపొడవైన మనిషి ట్యాంక్బండ్పై సందర్శకులను అలరించాడు. పిల్లలు, పెద్దలు అతడి విన్యాసాలను చూస్తూ ఎంజాయ్ చేశారు. విభిన్న గెటప్లు ప్రధానంగా చార్లీచాప్లిన్, మిక్కీమౌస్, మైకేల్ జాక్సన్, డోరేమాన్ వేషధారణతో కొందరు ట్యాంక్బండ్పై తిరుగుతూ సందర్శకులను ఉత్సాహపరిచారు.
ట్యాంక్బండ్పై ఉప్పల్కు చెందిన కుమార్ స్టిక్ వాకర్గా ప్రత్యేకార్షణగా నిలిచారు. అతడితో ఫొటోలు దిగేందుకు సందర్శకులు పోటీ పడ్డారు.
ట్యాంక్బండ్పై హెచ్ఎండీఏ ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసింది. ఇందులో హస్తకళలు, చేనేత వస్ర్తాలు, జూట్ బ్యాగులు, జ్యువెల్లరీ, ఆయుర్వేద ఉత్పత్తులను ప్రదర్శనకు పెట్టారు. అంతేకాక ఆసక్తి ఉన్న వారు కొనుగోలు చేసేందుకు కౌంటర్లు ఏర్పాటు చేశారు.
కోఠి, సుల్తాన్ బజార్లను తలపించేలా సౌందర్యానికి సంబంధించి వేపనాలు, సౌందర్య సాధనాలు, మట్టి గాజులు, చెవి రింగులతో పాటు రకరకాల వస్తువులను ఇక్కడి స్టాళ్లలో ఉంచారు.
డ్రై ఫూట్స్, ఈవెనింగ్ స్నాక్, టిఫిన్లను సైతం సందర్శకులకు వేడివేడిగా అందించారు. పిల్లల కోసం ఐస్క్రీం , పాప్కార్న్ బండ్లను ఏర్పాటు చేశారు.
ట్యాంక్బండ్పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రీ లైటింగ్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది. చెట్టుకు పిట్టగూడు మాదిరిగా లైటింగ్ ఏర్పాటు చేయగా ఫొటోలు, సెల్ఫీలతో సందర్శకులు ఎంజాయ్ చేశారు. అంతేకాక అక్కడక్కడ ఏర్పాటు చేసిన జిరాఫీ బొమ్మలను చూసి చిన్నారులు కేరింతలు కొట్టారు.
సన్డే ఫన్డే కార్యక్రమానికి వచ్చిన నగరవాసులకు హెచ్ఎండీఏ ఉచితంగా వేలాది మొక్కలను పంపిణీ చేసింది. ఇంట్లో నాటుకునే 25 వేల మొక్కలు స్టాళ్ల ద్వారా పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఇందులో సుమారు 31 రకాల మొక్కలు ఉన్నాయని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు.
ట్యాంక్బండ్పై పోలీసులు ప్రత్యేకంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సందర్శకులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా షీటీమ్స్, సివిల్ పోలీసులు, లేక్ పోలీసులు బందోబస్తును నిర్వహించారు. అందుబాటులో మొబైల్ టాయిలెట్స్ను, రెండు అంబులెన్స్ను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ట్యాంక్బండ్కు ఇరువైపులా ఉన్న మార్గాలను మూసి వేసి, కేవలం సందర్శకులు వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. ట్యాంక్బండ్ పైకి వచ్చే వాహనాలను లోయర్ ట్యాంక్బండ్ మీదుగా మళ్లించారు. అదేసమయంలో ఆర్టీసీ అధికారులు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ట్యాంక్బండ్ వరకు ప్రత్యేకంగా బస్సులను నడిపారు.
ట్యాంక్బండ్పై ఈ ఆదివారం ఎంతో బాగా ఎంజాయ్ చేశాం. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి సందడే కోరుకుంటారు. ఇక్కడ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లు బాగున్నాయి. -అమన్కుమార్
ఒకప్పుడు చూసిన ట్యాంక్బండ్ ఇప్పుడు చూస్తున్న ట్యాంక్బండ్కు ఎంతో తేడా ఉంది. ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దింది. ప్రత్యేకంగా చేసిన ఏర్పాట్లు ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తున్నాయి. – అఖిల్
ట్యాంక్బండ్పై ప్రతి ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఫ్రీ చేయాలన్న ఆలోచన చాలా బాగుంది. సందర్శకులను ఆకట్టుకునేలా స్టాళ్లు, ఫుడ్ కోర్టులు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉంది. ప్రతి ఆదివారం ట్యాంక్బండ్పై గడపడం కొత్త అనుభూతిని ఇస్తుంది. -మహేశ్
ట్యాంక్బండ్పై చేసిన ఏర్పాట్లతో పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సాగరతీరంలో పండుగ వాతావరణం కనిపిస్తున్నది. ఇక్కడ షాపింగ్ చేయడం మరిచిపోలేని అనుభూతి. లేజర్ షో అద్భుతంగా ఉంది. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తున్నది. – వాణి
నగరం నడిబొడ్డున ఉన్న సాగర తీరం ప్రత్యేక ఆకర్షణగా మారడం ఆనందంగా ఉంది. ట్యాంక్బండ్తో పాటు ఎన్టీఆర్ మార్గ్, సంజీవయ్య పార్కు, నెక్లెస్ రోడ్డు, జలవిహార్ ఇలా ఎన్నో అందమైన ప్రదేశాలు ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి. సందర్శకుల కోసం ట్యాంక్బండ్పై ట్రాఫిక్ లేకుండా చేయడం మరింత బాగుంది. -వర్షిణి