సిటీబ్యూరో, నమస్తేతెలంగాణ : నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ నీటిలో ఆక్సిజన్ స్థాయి మెరుగుపడిందని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) తన నివేదికలో వెల్లడించింది. ప్రతియేటా వినాయక నిమజ్జనానికి ముందు, ఆ తర్వాత సాగర్ జలాల్లో నీటి నాణ్యతను పరీక్షిస్తుంటారు. అయితే ఇటీవల విస్తారంగా వానలు కురవడంతో సాగర్లోని వ్యర్థాలన్నీ దిగువకు వెళ్లాయి. వినాయక చవితి నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు మూడుదఫాలుగా ఆరు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించారు. డిజాల్వ్డ్ ఆక్సిజన్ (నీటిలో ఆక్సిజన్ స్థాయి), టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్(టీడీఎస్) వంటివి సాధారణ స్థాయిలో ఉన్నట్లు గుర్తించామని పీసీబీ అధికారులు పేర్కొన్నారు.