సిటీబ్యూరో, జూలై 18 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్కు ఎప్పటికప్పుడు సరికొత్త శోభను తీసుకువస్తున్నారు. ఓ వైపు ట్యాంక్ ఆధునీకరణ పనులు చివరి దశలో ఉండగా,పీ.వీ.నరసింహారావు రావు మార్గ్ను పూర్తిగా ఆధునీకరించారు. పీ.వీ. జయంతిని పురస్కరించుకొని భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. నెక్లెస్ రోడ్డులో జలవిహార్ పక్కన ఉన్న 10ఎకరాల ఖాళీ స్థలాన్ని లేక్ ఫ్రంట్ పార్కుగా అభివృద్ధి చేసేందుకు పనులు మొదలు పెట్టారు. ఖాళీ స్థలాన్ని అభివృద్ధి చేసి సందర్శకులకు ఆహ్లాదాన్ని అందించడమే లక్ష్యంగా ముంబైకి చెందిన ప్రముఖ అర్కిటెక్ట్ కిశోర్ డి.ప్రధాన్ రూపొందించిన డిజైన్ల ఆధారంగా అధికారులు ఈ పర్యాటక క్షేత్రాన్ని సాగర తీరంలో అందంగా తీర్చిదిద్దనున్నారు.
ల్యాండ్స్కేప్లో కిశోర్ ప్రధాన్ది ప్రత్యేకమైన శైలి. 1972 నుంచి దేశ, విదేశాల్లో సరికొత్త అందాలను ఆయన ప్రజలకు పరిచయం చేశారు. అలాంటి నిపుణుడితో సాగర తీరంలో లేక్ వ్యూ పార్కుకు డిజైన్ చేయించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నెక్లెస్రోడ్లోని దాదాపు 10ఎకరాలకు పైగా కాళీ స్థలం నిరుపయోగంగా ఉన్నట్లు గుర్తించారు. దాన్ని ఆనుకొని 4.73 చదరపు కిలోమీటర్ల నీటి ప్రవాహం ఉందని హెచ్ఎండీఏ అధికారులు అర్కిటెక్ కిశోర్కు వివరాలను అందజేశారు. దాన్ని పరిగణలోకి తీసుకోవడంతో పాటు పలుమార్లు స్థలాన్ని సందర్శించిన అర్కిటెక్ట్ కిశోర్ ప్రధాన్ ల్యాండ్స్క్రేప్ డెవలప్మెంట్ ఫర్ లేక్ ఫ్రంట్ పార్కు (ఉద్యానవనం)కోసం మాస్టర్ప్లాన్ రూపకల్పన చేసి హెచ్ఎండీఏకు అందించారు. దాదాపు 20 విభిన్న అంశాలను పర్యాటకులకు పరిచయం చేసేలా డిజైన్లు సమర్పించారు. దీనికి ఒకే చెప్పిన హెచ్ఎండీఏ సుమారు రూ. 15కోట్ల వ్యయంతో లేక్ ఫ్రంట్ పార్కు నిర్మాణ పనులను చేపట్టి నిర్వహిస్తున్నది.
నగరం నడిబొడ్డున ఉన్న హుస్సేన్సాగర్ చుట్టూ తీర ప్రాంతాన్ని నగర వాసులతోపాటే దేశ,విదేశీ పర్యాటకుల్ని ఆకట్టుకునే విభిన్న శైలిలో డిజైన్లను రూపొందించి, వాటిని అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా సందర్శకులు కుటుంబసమేతంగా తరలివచ్చి చక్కటి వాతావరణంలో ఎంజాయ్ చేసేలా సరికొత్త అందాలను పరిచయం చేయనున్నారు. వరంగల్ జిల్లాలోని లక్నవరం జలాశయంలో ఉన్నట్లుగా వేలాడే వంతెన, లేక్ అందాలన్నీ కనబడే విధంగా లోకేషన్ తీరం, సాగర్ ఒడ్డున కూర్చుని సేద తీరేలా, అబ్బురపరిచే ప్రవేశ ద్వారం, పాత్వేలు, పిల్లలకు కోసం ప్లే గ్రౌం డ్, అందాలన్నీ ఆస్వాదించేలా అండర్పాస్, వాటర్ థీమ్ పార్కు, సాగర్ అలలపై నిలుచున్నట్లు గ్లాసు డెక్, ఫ్లోర్ స్క్రేప్, ఎలివేటెడ్ వాక్వే, పెడస్ట్రరీయన్ ట్రయల్స్ అండ్ మూడు మీటర్ల వెడల్పుతో వేవ్ వాక్, ఇన్నోవేటివ్ చిల్డ్రన్ ప్లే ఏరియా ఇలా ఎన్నో ప్రత్యేకతలతో పర్యాటకులకు కనువిందు చేసేలా హెచ్ఎండీఏ పనులు చేపడుతోంది. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించారు.