సిటీబ్యూరో, జూన్ 20 (నమస్తే తెలంగాణ): హుస్సేన్సాగర్ జలాల శుద్ధిపై హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. సాగర్లోకి నగర నలువైపులా నుంచి మురుగునీటితో పాటు చెత్తాచెదారం, ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలు వస్తున్నాయి. దీంతో సాగర్ తీరప్రాంతమంతా వ్యర్థాలతో నిండిపోతోంది. ఈ నేపథ్యంలో సాగర్లోకి మురుగునీటితో పాటు వచ్చే చెత్తాచెదారాన్ని అడ్డుకునేందుకు పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా సాగర్లోకి వచ్చే వ్యర్థాలను ఎక్కడికక్కడ అడ్డుకొని.. బయట వేసేందుకు ట్రాష్ కలెక్షన్ వ్యవస్థలను 4 చోట్ల ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులను 5 ఏండ్ల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఇలా చేయడం ద్వారా భవిష్యత్తులో హుస్సేన్సాగర్లోకి వ్యర్థాలు చేరకుండా కేవలం మురుగునీరు చేరినా దాన్ని శుద్ధి చేయడం సులభంగా మారుతుంది.
హుస్సేన్సాగర్ తీర ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు. ఒకవైపు ట్యాంక్బండ్, మరోవైపు ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, పీవీ నరసింహారావు మార్గం( నెక్లెస్ రోడ్), సంజీవయ్య పార్కు , జలవిహార్ ఇలా సందర్శనీయ స్థలాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇంకా కొత్తగా లేక్ వ్యూ పార్కును సైతం సరికొత్త డిజైన్లతో నిర్మిస్తున్నారు. గత ఏడాదిలో నెక్లెస్ రోడ్డును సీసీ రోడ్డుగా నిర్మించి.. ఈ మార్గాన్ని సందర్శకులు రోజంతా హాయిగా తమ కుటుంబ సమేతంగా గడిపేలా చేశారు. ఈ నేపథ్యంలోనే సాగర్ జలాలను సైతం మురుగునీరు, చెత్తాచెదారంతో నిండిపోకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే బేగంపేట నాలా వైపు నుంచి సాగర్లోకి వచ్చిన వ్యర్థాలను తీసి ఒక గుట్టగా పోసి.. అందమైన దీవిగా ఏర్పాటు చేసి పచ్చదనం పెంపొందించారు. ఇలా.. సాగర్ను నగరంలోనే సుందర పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే పనులను హెచ్ఎండీఏ చేపట్టింది.