డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం పేస్, బౌన్సీ పిచ్ సిద్ధం చేస్తున్న క్యూరేటర్
సౌతాంప్టన్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమ్ఇండియాకు పేస్ పరీక్ష ఎదురుకావడం దాదాపు ఖరారైంది. ఈ నెల 18 నుంచి సౌతాంప్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగే తుదిపోరుకు పేస్, బౌన్స్కు సహకరించే పిచ్ సిద్ధమవుతున్నది. దీంతో బౌల్ట్, సౌథీ, జెమీసన్, వాగ్నర్తో కూడిన కివీస్ బౌలింగ్ దళం నుంచి కోహ్లీసేనకు సవాల్ ఎదురుకానుంది. మరోవైపు భారత్ పేస్ విభాగం కూడా బలంగా ఉండడం, మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్ది స్పిన్నర్లకు సైతం పిచ్ నుంచి సహకారం లభించే అవకాశం ఉండడంతో పోరు రసవత్తరం కానుంది. కాగా సౌతాంప్టన్ పిచ్ విషయాలను మైదానం ప్రధాన గ్రౌండ్స్మన్, క్యూరేటర్ సిమన్ లీ సోమవారం వెల్లడించారు. ‘ఈ టెస్టుకు ఇది తటస్థ వేదిక కావడంతో పిచ్ సిద్ధం చేయడం మాకు కాస్త సులువైంది. ఐసీసీ ఆదేశాల ప్రకారం ఇరు జట్లకు సమానంగా సహకరించేలా పిచ్ తయారు చేయాలని మేం అనుకుంటున్నాం. అయితే పేస్కు, బౌన్స్కు ఎక్కువ అనుకూలించేలా పిచ్ ఉండాలని వ్యక్తిగతంగా నేను అనుకుంటున్నా. వాతావరణ పరిస్థితులు కాస్త అనుకూలించినా ఈ హార్డ్ పిచ్ పేస్కు బాగా సహకరిస్తుంది. టెస్టు క్రికెట్ను పేస్ బౌలింగ్ ఉత్కంఠభరితంగా మారుస్తుంది. క్రికెట్ ప్రేమికుడిగా నేను దాన్ని ఆస్వాదిస్తా’ అని ఓ ఇంటర్వ్యూలో లీ చెప్పారు. అలాగే ఇరు జట్లు బౌలింగ్ విభాగంలో బలంగా ఉండడంతో పేస్ పోరు రసవత్తరంగా ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డాడు.
విజేతకు గద, రూ.11.71 కోట్లు
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో విజేతగా నిలిచిన జట్టుకు చాంపియన్ గదతో పాటు 1.6 మిలియన్ డాలర్లు (దాదాపు రూ.11.71 కోట్లు) దక్కనున్నాయి. ఫైనల్లో ఓడి రన్నరప్గా నిలిచిన టీమ్ 8లక్షల డాలర్లు (దాదాపు రూ.5.85 కోట్లు) అందుకోనుంది. డబ్ల్యూటీసీ ప్రైజ్మనీ వివరాలను ఐసీసీ సోమవారం ప్రకటించింది. ఒకవేళ ఫైనల్ డ్రా లేదా టై అయితే ప్రైజ్మనీని ఇరు జట్లకు సమానంగా పంచనున్నట్టు తెలిపింది. అలాగే టెస్టు చాంపియన్షిప్లో పాల్గొన్న మిగిలిన ఏడు జట్లకు స్థానాల ప్రకారం ఐసీసీ నగదు ప్రోత్సాహం అందించనుంది. మూడో స్థానంలో నిలిచిన జట్టుకు 4.50లక్షల డాలర్లు, నాలుగో ప్లేస్కు 3.50లక్షల డాలర్ల చెక్లను ఐసీసీ అందించనుంది.