ఉచిత నీటి సరఫరా పథకం కొరకు ఆధార్ అనుసంధానం చేసుకొని వినియోగదారులకు జలమండలి బిల్లులను జారీ చేస్తుంది. వాస్తవానికి బకాయి బిల్లులపై సుమారు 11 శాతం జరిమానాతో గతంలో జలమండలి బిల్లులను జారీ చేసేది. కాని, గతంలో బిల్లుల జారీ ప్రక్రియను ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆపిన సంగతి విధితమే. ఈ క్రమంలోనే ప్రస్తుతం గత ఐదు నెలల బిల్లులకు ఎలాంటి జరిమానా విధించకుండానే ఉచిత నీరు పథకానికి ఆధార్ అనుసంధానం చేయని వినియోగదారులకు మాత్రమే బిల్లులను జారీ చేస్తున్నట్లు జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. కాగా, ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఏప్రిల్ నెలాఖరు నాటికి క్యాన్ నెంబర్లతో ఆధార్ అనుసంధానం గడువు ముగిసింది.
మొత్తం 12 లక్షల మంది నీటి వినియోగదారులుండగా, సుమారు తొమ్మిది లక్షల మంది గృహ అవసర వినియోగదారులుండగా, మిగిలిన వారు కమర్షియల్, ఇండస్ట్రీయల్ వినియోగదారులున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. సుమారు తొమ్మిది లక్షల మందిలో ఏప్రిల్ నెలాఖరు నాటికి కొత్తగా కేవలం 35 – 40 వేల వరకు మాత్రమే మీటర్లను బిగించుకొని ఆధార్ నెంబర్లను క్యాన్ నెంబర్లతో అనుసంధానం చేసుకున్నారు. వీరికి ప్రస్తుతం 20 వేల లీటర్ల వరకు నీటిని ఉచితంగానే అందిస్తున్నామని అధికారులు పేర్కొంటున్నారు.