సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ) : వానకాలం ప్రారంభమైన నేపథ్యంలో గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న జలమండలి అప్రమత్తం అయ్యింది. 15 రోజుల క్రితమే ముందస్తు ప్రణాళికను ప్రకటించిన వాటర్ బోర్డు.. వానకాలం ప్రణాళికను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నది. ముఖ్యంగా రానున్న నెల రోజుల్లో వానలు అధికంగా పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సీవరేజీ, నీటి సరఫరా విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర సమయాల్లో మురుగు నీరు ఓవర్ఫ్లో అయినప్పడు ఎయిర్టెక్ మిషన్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అవసరం ఉన్న ప్రాంతాల్లో ముందస్తుగా ఎయిర్టెక్ మిషన్లను అద్దెకు తీసుకోవాలని నిర్ణయించారు.
వరదలు ఎక్కువగా వచ్చిన సందర్భాల్లో మ్యాన్హోళ్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ సూచనల మేరకు సుమారు రూ.8 కోట్లు వెచ్చించిన జలమండలి నగరంలోని సుమారు 10,120 మ్యాన్హోళ్లకు మరమ్మతులు పూర్తి చేసింది. అలాగే 140 లోతట్టు ప్రాంతాల్లోని మ్యాన్హోళ్లకు సేప్టీగ్రిల్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఇక మ్యాన్హోళ్ల నిర్వహణ, లోతట్టు ప్రాంతాల్లో నీటిని నాలాల్లోకి పంపే విషయంలో జీహెచ్ఎంసీ అధికారులతో జలమండలి సమన్వయంగా పనిచేయనున్నది. వర్షం వచ్చే సమయంలో సీవరేజీ సూపర్వైజర్లను నియమించి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టనున్నారు.
నగరంలో ఎక్కడైనా మ్యాన్హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉన్నట్లు గుర్తించినా వెంటనే జలమండలి కస్టమర్కేర్ నంబర్ 155313కి కాల్ చేసి సమాచారం ఇవ్వాలని జలమండలి ఎండీ దానకిశోర్ నగర ప్రజలను కోరారు. లోతుగా ఉన్న మ్యాన్హోళ్ల దగ్గర సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని, క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతిఒక్క సిబ్బంది, అధికారి జలమండలి యూనిఫాంను ధరించాలని ఆదేశించారు. ఇదే సమయంలో తాగునీటి లైన్ క్రాసింగ్ వద్ద చెత్త చేరకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జలమండలి అధికారులకు సమాచారం ఇవ్వకుండా మ్యాన్హోల్స్ మూతలను తెరవకూడదని జలమండలి అధికారులు సూచిస్తున్నారు.