సిటీబ్యూరో, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ): భవిష్యత్ అవసరాలకు తగ్గట్లుగా నగరాభివృద్ధితో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధి ఔటర్ రింగు రోడ్డును దాటి విస్తరిస్తున్న ఈ నేపథ్యంలో ఓఆర్ఆర్ పరిధిలోని ప్రాంతాలకు తాగునీటిని అందించడానికి, కొత్త ఎస్టీపీల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపు, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మార్గదర్శకంలో హైదరాబాద్ను విశ్వ నగరంగా మార్చడానికి అన్ని రంగాలకు చేయూతనిస్తూ, ముఖ్యంగా తాగునీరు, మురుగునీటి శుద్ధి కోసం ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం గతంలో ఎప్పుడూ జరగలేదన్నారు. ఇటీవల ప్రభుత్వం రెండు ప్రాజెక్టులకు భారీగా నిధులు కేటాయించిన నేపథ్యంలో శనివారం ఖైరతాబాద్లోని జల మండలి ప్రధాన కార్యాలయంలో జల మండలి ఎండీ దాన కిశోర్తో కలిసి మంత్రులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ.. వేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్లో తాగునీరు, మురుగునీటిని శుద్ధి చేసేందుకు అవసరమైన ఎస్టీపీల నిర్మాణం కోసం రూ.5 వేల కోట్లు ప్రభుత్వం కేటాయించడం హర్షణీయమన్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ నగరంలో శాశ్వత మురుగునీటి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించిందన్నారు.
ఇప్పటికే ఉన్న 25 ఎస్టీపీలకు తోడు అదనంగా మరో 31 ఎస్టీపీలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. జలమండలి ఎండీ దానకిశోర్ మాట్లాడుతూ..రెండున్నరేండ్ల క్రితం రూపొందించిన సీవరేజి మాస్టర్ ప్లాన్ మేరకు మొదటి విడుతగా జీహెచ్ఎంసీ పరిధిలో 31 ఎస్టీపీల నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుందని అన్నారు. 31 ఎస్టీపీల్లో 21 ఎస్టీపీలను చెరువుల వద్దే నిర్మిస్తున్నామన్నారు.
సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, జలమండలి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎం.సత్యనారాయణ, ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీధర్ బాబు, ఫైనాన్స్ డైరెక్టర్ వాసుదేవ నాయుడు, రెవెన్యూ డైరెక్టర్ వీఎల్. ప్రవీణ్ కుమార్, ఆపరేషన్స్ డైరెక్టర్లు అజ్మీరా కృష్ణ , స్వామి, సీజీఎంలు, జీఎంలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.