సిటీబ్యూరో, మే 28 (నమస్తే తెలంగాణ ) : వరుసగా మూడేండ్లు కరువు వచ్చినా.. కృష్ణా జలాల సేకరణకు ఎలాంటి ఢోకా ఉండదు. నగరానికి మూడు దశల్లో రోజూ 270 ఎంజీడీల నీటిని తరలిస్తుండగా, నానాటికీ విస్తరిస్తున్న జనాభాకు అనుగుణంగా శాశ్వత పరిష్కారంగా సుంకిశాల పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నాగార్జునసాగర్ నీటి నిల్వలు 500 అడుగుల దిగువకు పడిపోయినా గ్రేటర్ తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుంకిశాల ఇంటెక్ వెల్ నిర్మాణానికి జలమండలి ప్రతిపాదనలు రూపొందించింది. రూ. 1450 కోట్ల అంచనా వ్యయంతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. 3.90 శాతం ఎక్కువ కోట్ చేసి ఈ ప్రాజెక్టు పనులను మెగా కంపెనీ దక్కించుకున్నది. ఈ నేపథ్యంలోనే సుంకిశాల నిర్మాణానికి అనుమతిస్తూ.. ప్రభుత్వం శుక్రవారం జీవో నం. 413ను జారీ చేసింది. ఈ ప్రాజెక్టు అందుబాటులోకి వస్తే వర్షాభావంతో కృష్ణా నదికి వరుసగా రెండు, మూడేండ్లు వరద నీరు రాకున్నా డెడ్స్టోరేజీ నుంచి హైదరాబాద్ తాగునీటి కోసం జలాలను సేకరించే అద్భుత అవకాశం ఏర్పడుతుంది.