సిటీబ్యూరో, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : నగరంలో బుధవారం పలు చోట్ల నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరానికి మంచినీటిని సరఫరా చేస్తున్న కృష్ణా ఫేజ్-3 యాచారం వద్ద 2375 ఎంఎం డయా ఎమ్మెస్ పంపింగ్ మెయిన్ పైపులైను వద్ద ఏర్పడిన లీకేజి వద్ద మరమ్మతుల కారణంగా ఈ అంతరాయం కలుగుతుందని తెలిపారు. బీఎన్రెడ్డినగర్, ఎల్బీనగర్, ఆటోనగర్, వనస్థలిపురం, బండ్లగూడ, ఉప్పల్, మైలార్దేవ్పల్లి, హైదర్గూడ, రాజేంద్రనగర్, ప్రశాసన్నగర్, జూబ్లీహిల్స్, తట్టిఖాన, మెహిదీపట్నం, కార్వాన్, లంగర్హౌస్, కాకతీయ నగర్, మౌలాలి, మణికొండ, గంధంగూడ, నార్సింగి తదితర ప్రాంతాల్లో బుధవారం ఉదయం 8నుంచి గురువారం ఉదయం 8గంటల వరకు పనులు కొనసాగుతాయని పేర్కొన్నారు. ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.