సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తేతెలంగాణ) : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న గచ్చిబౌలి ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్-కోకాపేటల మధ్య ఐటీ కారిడార్లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) అత్యున్నతస్థాయి మౌలిక వసతులతో కూడిన భారీ వెంచర్ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. ఐటీ, ఐటీఈఎస్ కంపెనీల కోసం హైరైజ్ బిల్డింగ్లు నిర్మించేందుకు వీలుగా 100అడుగుల రోడ్ల వెడల్పుతో ఒక్కో ప్లాటు సైజు 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేస్తున్నారు. ఐటీ కారిడార్లో ఆధునికశైలి కలిగి ఉండేలా ‘నియోపొలిస్’ పేరుతో ఏర్పాటు చేస్తున్న వెంచర్ను ఔటర్ను ఆనుకొని కోకాపేటలో సుమారు 150 ఎకరాల్లో ఈ వెంచర్ను హెచ్ఎండీఏ ఎంతో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్నది. ఔటర్ రింగురోడ్డుకు ఆనుకొని ఉండటంతో ఇక్కడ భూములకు విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రస్తుతం ఐటీ కారిడార్ మరింతగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఐటీ కంపెనీలు ఇక్కడే ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. లేఅవుట్లో రోడ్లు, ఇతర మౌలిక వసతులు పోను మిగిలిన 70 ఎకరాలను విక్రయించనున్నారు.