సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ): హెచ్ఎండీఏ విలువైన భూముల పరిరక్షణ కోసం పటిష్ట చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి, హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హెచ్ఎండీఏ భూములు, సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. మొదట రాజేంద్రనగర్లోని బుద్వేల్లో 85 ఎకరాలు, కొత్వాల్గూడలోని 80 ఎకరాల భూములను ఆయన పరిశీలించారు. అనంతరం పటాన్చెరు సమీపంలోని సంస్థకు చెందిన 35 ఎకరాల భూమిని ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో సంస్థకు చెందిన విలువైన భూములను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎస్టేట్స్ అధికారులపై ఉందని, ఈ విషయంలో అధికారులు క్షేత్ర స్థాయిలో నిరంతరం పర్యవేక్షణ చేయాలని సూచించారు.
అనంతరం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులను అర్వింద్ కుమార్ పరిశీలించారు. నార్సింగి ఓఆర్ఆర్ వద్ద ఇంటర్ చేంజ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కోకాపేట లేఅవుట్ డెవలప్మెంట్, మౌలిక వసతుల పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం గండిపేట చెరువు వద్ద రూ. 36 కోట్లతో చేపట్టిన పార్కు సుందరీకరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ..కోట్ల రూపాయలతో హెచ్ఎండీఏ చేపడుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, లాక్డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. అభివృద్ధి పనులను నాణ్యతతో చేపట్టేలా తరచూ పర్యవేక్షించాలని, చేపట్టిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా అధికారులు క్షేత్ర స్థాయిలో ఆయా పనులను పరిశీలించాలని కమిషనర్ సూచించారు. కమిషనర్తో పాటు హెచ్ఎండీఏ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, హెచ్ఎండీఏ ఎస్టేట్ ఆఫీసర్ గంగాధర్, సీజీఎం మాజిద్ షరీఫ్, సూపరింటెండింగ్ ఇంజినీర్ పరంజ్యోతి, ఈఈలు అప్పారావు, పద్మ ఉన్నారు.