నగర రియల్ మార్కెట్లో మరో మైలురాయి. పశ్చిమాన, ఐటీ కారిడార్కు అత్యంత సమీపంలో మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సకల వసతులతో అభివృద్ధి చేస్తున్న కోకాపేట భూముల వేలానికి రంగం సిద్ధమైంది. నియోపొలిస్ పేరుతో హెచ్ఎండీఏ, ఎంఎస్టీసీలు సంయుక్తంగా గురువారం ఈ-వేలం ద్వారా ఆన్లైన్లో ఈ భూముల విక్రయం జరగనుంది. మొత్తం 49.94 ఎకరాలను 8 ప్లాట్లుగా విభజించారు. హైరైజ్ బిల్డింగ్లు నిర్మించేలా 100 అడుగుల రోడ్లు, తాగునీటి ట్యాంక్లు, విద్యుత్ సబ్స్టేషన్లతోపాటు పచ్చదనానికి ప్రాధాన్యమిస్తూ ఈ భూములను అభివృద్ధి చేస్తున్నారు. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లు నిర్ధారించగా, బుధవారం సాయంత్రం వరకు సుమారు 60 మంది బిడ్డర్లు వేలంలో పాల్గొంటున్నట్లు వెబ్సైట్లో నమోదు చేసుకున్నారని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపనున్న ఈ భూముల అమ్మకాలు పూర్తిగా ఆన్లైన్లోనే జరుగుతాయని, అత్యంత పారదర్శకంగా ఈ ప్రక్రియ కొనసాగుతుందని వెల్లడించారు. నగరానికి చెందిన పలు దిగ్గజ రియల్ ఎస్టేట్ సంస్థలు, దేశ, విదేశీ కంపెనీలు, ఫార్మా సంస్థలు కోకాపేట భూముల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి.
కరోనా ప్రభావం, లాక్డౌన్తో మూడునాలుగు నెలలుగా సర్కారు రాబడి తగ్గింది. వివిధ అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలను పరుగు పెట్టించేందుకు ప్రభుత్వం ఐటీ కారిడార్ సమీపంలోని భూములను వేలం వేయాలని నిర్ణయించింది. ఎకరం ధర కనీసం రూ.25 కోట్లు నిర్ధారించినా, క్రేజ్ నేపథ్యంలో ఎకరం రూ.40 నుంచి రూ.50 కోట్లు పలికే అవకాశం ఉన్నది. ఈ లెక్కన 49.94 ఎకరాలకు రూ.2 వేల కోట్లపైనే వచ్చే అవకాశం ఉంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కోకాపేట భూముల ఆన్లైన్ వేలానికి అంతా సిద్ధ్దమైంది. నెల రోజులుగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ), ఎంఎస్టీసీ లిమిటెడ్ సంస్థలు ఆన్లైన్ ప్రక్రియను నిర్వహించనున్నాయి. ఈనెల 15వ తేదీ ఉదయం 4ప్లాట్లను, మధ్యాహ్నం మరో 4 ప్లాట్లకు ఆన్లైన్లో వేలం జరుగనుంది.హాట్కేక్ లాంటి ఐటీ కారిడార్లోని కోకాపేటలో ప్రభుత్వ భూములను ఐటీ,ఐటీఈఎస్ కంపెనీలు, హైరైజ్ అపార్టుమెంట్లు నిర్మించేందుకు వీలుగా భారీ సైజులోఒక్కో ప్లాటు విస్తీర్ణం 1ఎకరం నుంచి 8ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చేశారు. కోకాపేట రెవెన్యూ పరిధిలోని సర్వే నం.239,240,109లో ఉన్న భూము ల్లో 49.949 ఎకరాలను 8 ప్లాట్లుగా అభివృద్ధి చేసి, ఆన్లైన్లో విక్రయించాలని నిర్ణయించారు.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపనున్న కోకాపేట లేఅవుట్లో ప్లాట్ల విక్రయాలన్నీ ఆన్లైన్లోనే జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థ ఎంఎస్టీసీ లిమిటెడ్ ఆన్లైన్ భూముల వేలానికి సంబంధించిన లావాదేవీలను చూస్తున్నది. ఒక్కో ఎకరాకు కనీస ధరను రూ.25కోట్లుగా నిర్ణయించారు. ఆన్లైన్ వేలంలో పాల్గొనే వారు ఫ్రీబిడ్ ఈఎండీ కింద రూ.5 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది.బుధవారం సాయంత్రం వరకు సుమారు 60 మంది బిడ్డర్లు హెచ్ఎండీఏ ఆన్లైన్లో విక్రయిస్తున్న కోకాపేట ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఎంఎస్టీసీ వెబ్సైట్లో నమోదు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. 15వ తేదీ ఉదయం నుంచి ఆన్లైన్లోనే వేలం ప్రక్రియ కొనసాగుతుంది.ఎంఎస్టీసీ నిర్వహించే ఆన్లైన్ వేలం ప్రక్రియను హెచ్ఎండీఏ కార్యాలయం అధికారులు పర్యవేక్షిస్తారు. ప్లాట్ నం.1,2,3,12లకు ఉదయం వేలం పాట ఉంటుందని, అదేవిధంగా ప్లాట్ నం.4,14, ఎ, 2/పీ వెస్ట్పార్ట్కు మధ్యాహ్నం వేలం ఉంటుందని అధికారులు తెలిపారు. ప్రతి ప్లాటుకు ఫ్రీబిడ్ ఈఎండీ కింద రూ. 5కోట్లు చెల్లించారు. ఇప్పటి వరకు సుమారు 60 మంది కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో ప్లాట్లను కొనుగోలు చేసేందుకు తమ వివరాలను నమోదు చేసుకున్నట్లు సమాచారం.
గత ఏడాదిన్నరగా కరోనాతో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎన్నో ఒడిదుడుకలను ఎదుర్కొంటోంది. అయినా దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగానే ఉంది. ఇండ్లు, అపార్టుమెంట్లలో ప్లాట్ల అమ్మకాలతో పాటు కొత్త ప్రాజెక్టుల ప్రారంభోత్సవాల్లో వృద్ధి రేటు మెరుగ్గానే ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరానికి పడమర దిక్కున ఉన్న ఐటీ కారిడార్లో రియల్ బూమ్ కొనసాగుతున్నది. ఈ పరిధిలోనే అత్యంత భారీ ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. తాజాగా ఇదే ప్రాంతంలోని కోకాపేటలో ప్రభుత్వ భూములను ఆన్లైన్ ద్వారా విక్రయానికి పెట్టడంతో దీనిపై రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఎంతో ఆసక్తి నెలకొన్నది. నగరానికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులతో దేశ, విదేశీ కంపెనీలు కోకాపేటలో భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు ఫార్మా దిగ్గజ్జ కంపెనీలు సైతం కోకాపేట నియోపోలీస్ లేఅవుట్లో విలువైన భూములను సొంతం చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులకు ఇతర రంగాలకు చెందిన వారు సైతం ముందుకు వస్తుండడంతో హెచ్ఎండీఏ విక్రయిస్తున్న భూములకు డిమాండ్ నెలకొంది. కోకాపేటలో ఎకరం ధర రూ.40కోట్లకు పైనే ఉంటుందని రియల్ ఎస్టేట్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.
సుమారు 49.94 ఎకరాల్లోని 8 ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించనున్నారు. ఎకరం ధరం రూ.40 కోట్ల నుంచి రూ.50కోట్ల మధ్య ధర పలికే అవకాశం ఉంది. ఈ భూముల వేలం ద్వారా తక్కువలో తక్కువగా ప్రభుత్వానికి రూ.2000 కోట్లకు పైనే ఆదాయం వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.