హైదరాబాద్ : హైదరాబాద్ మహానగరానికి మణిహారమైన ఔటర్ రింగు రోడ్డు నిత్యం పచ్చదనంతో మెరిసేలా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) సరికొత్త ఏర్పాట్లు చేస్తోంది. 158 కిలోమీటర్ల పొడవున్న ఓఆర్ఆర్ చుట్టూ నాటిన రకరకాల చెట్లు, పూల మొక్కలు నిరంతరం పచ్చగా ఉండేలా ఆధునిక నీటి సరఫరా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు నిశ్చయించారు. ఇందులో భాగంగా ఓఆర్ఆర్ సెంట్రల్ మీడియన్పై మూడు వరసల్లో, ఇరువైపులా ఉండే సర్వీస్ రోడ్ల పొడవునా మూడు వరసల చొప్పున మొత్తం తొమ్మిది లైన్లలో డ్రిప్ సిస్టంను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం ఓఆర్ఆర్ను ఐదు ప్యాకేజీలుగా విభజించి.. వాటి నిర్వహణను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ఇటీవలే టెండర్లు పిలిచారు. మొత్తం ఐదు ప్యాకేజీలకు రూ.42 కోట్లు చెల్లించాలని అంచనా వేశారు.
ప్రస్తుతం ఓఆర్ఆర్ చుట్టూ నాటిన చెట్లు, పూల మొక్కలను సంరక్షించేందుకు అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెచ్చి పోస్తున్నారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం రూ.30 కోట్ల వరకు వెచ్చిస్తున్నారు. ఇంత చేస్తున్నా సరిగా నీరు అందకపోవడంతో పచ్చదనం దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో ఆధునిక డ్రిప్ సిస్టంను ఏర్పాటు చేయాలని నిర్ణయించి రూ.42 కోట్ల వరకు ఖర్చు అవుతుందని లెక్క గట్టారు. ఈ ఆధునిక వ్యవస్థ పర్యవేక్షణను ఏడు సంవత్సరాల పాటు ప్రైవేటు సంస్థలకు అప్పగించనున్నారు. ఇదే జరిగితే ఏటా ఖర్చు చేస్తున్న రూ.30 కోట్లను ఆదా చేయవచ్చని హెచ్ఎండీఏ అధికారులు భావిస్తున్నారు.
ఓఆర్ఆర్ చుట్టూ 19 చోట్ల ఇంటర్చేంజ్లు ఉన్నాయి. ఇక్కడ రకరకాల మొక్కలు పెంచుతూ ఎంతో ఆకర్షణగా తీర్చిదిద్దారు. అయితే ఇంటర్చేంజ్ల వద్ద ఉన్న మొక్కలకు నీటిని అందించేందుకు మాత్రం స్పింక్లర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఓఆర్ఆర్ చుట్టూ ఏర్పాటు చేసే డ్రిప్ విధానం కోసం ఆసక్తి గల సంస్థలు టెండర్లను దాఖలు చేసేందుకు ఈ నెల 17 వరకు గడువు విధించారు. 158 కిలోమీటర్లు పొడువు ఉన్న ఓఆర్ఆర్ను ఐదు ప్యాకేజీలుగా విభజించిన అధికారులు టెండర్లను పిలిచారు.