సిటీబ్యూరో, జూన్ 8 (నమస్తే తెలంగాణ): నగర శివారులోని చెరువులకు సరికొత్త అందాలను తీసుకువచ్చేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) శ్రీకారం చుట్టింది. ఇప్పటికే శివారు మునిసిపాలిటీలైన బడంగ్పేట, మీర్పేట మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలోని చెరువులను మినీ ట్యాంక్ బండ్లుగా తీర్చిదిద్దుతున్నారు. తాజాగా జల్పల్లి మునిసిపాలిటీ పరిధిలో జల్పల్లి చెరువును అత్యాధునిక హంగులతో అభివృద్ధి చేసేందుకు హెచ్ఎండీఏ ఇంజినీరింగ్ విభాగం ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
సుమారు రూ.7 కోట్ల వ్యయంతో జల్పల్లి చెరువును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు అక్కడ రాళ్లతో కూడిన గుట్టలను కలుపుకొని గార్డెన్గా తీర్చిదిద్దాలని ఇంజినీరింగ్ అధికారులు డిజైన్లు రూపొందించి.. బడ్జెట్ అంచనాలు సిద్ధం చేసి టెండర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ చెరువును స్థానిక ప్రజలే కాకుండా నగర ప్రజలు కూడా సందర్శించేలా తీర్చిదిద్దనున్నారు. ఇందుకోసం మొదట రూ.7 కోట్లతో పనులు చేపట్టినా, తర్వాత మరో రూ. 2 కోట్ల వరకు వెచ్చించి చెరువు చుట్టూ ఉన్న కొండల ప్రాంతాన్ని ఆకర్షణీయమైన రాక్ గార్డెన్గా తీర్చిదిద్దాలని హెచ్ఎండీఏ అధికారులు కృషి చేస్తున్నారు.
చెరువుల పరిరక్షణతో పాటు చుట్టు పక్కల నివాసం ఉంటున్న వారికి ఉదయం, సాయంత్రం వేళల్లో సరదాగా కుటుంబ సమేతంగా సేద తీరేందుకు చెరువులను హాట్ స్పాట్లుగా మార్చాలని లేక్ ప్రొటెక్షన్ కమిటీ నిర్ణయించింది. ఇందులో భాగంగా హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న వేలాది చెరువులను దశలవారీగా అభివృద్ధి చేపట్టేందుకు చర్యలు చేపట్టింది.