సిటీబ్యూరో, జూలై 25(నమస్తే తెలంగాణ): నగర శివారులోని జంట జలాశయాలకు వరద తాకిడి తగ్గింది. జలాశయాల ఎగువ ప్రాంతంలో రెండు రోజులుగా వానలు తగ్గడంతో హిమాయత్, ఉస్మాన్సాగర్లకు ఇన్ఫ్లో క్రమంగా తగ్గుతుందని, ఈ క్రమంలోనే ఉస్మాన్ సాగర్కు సంబంధించిన రెండు గేట్లను, హిమాయత్సాగర్కు సంబంధించిన రెండు గేట్లను మూసివేయడం జరిగిందని జలమండలి అధికారులు తెలిపారు. అయితే, హిమాయత్సాగర్లో నీటిమట్టం గరిష్టస్థాయిలో ఉండటంతో పాటు కొంత వరకు ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో సుమారు ఐదు గేట్ల ద్వారా నీటిని ఈసీ నది ద్వారా మూసీ నదిలోకి వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇన్ఫ్లో తగ్గిన నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గేట్లను మూసివేశామని జలమండలి అధికారులు తెలిపారు.
శంషాబాద్ రూరల్: నానాజీపూర్ గ్రామం వద్ద ఎంటేరు వాగులో రెండు రోజుల నుంచి వాటర్ ఫాల్స్ కొనసాగుతున్నాయి. దీంతో మండలంలోని వివిధ గ్రామాల నుంచి కాకుండా హైదరాబాద్ నగరం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఆనందంగా గడుపుతున్నారు. కుటుంబ సభ్యులు, ఫాల్స్ ప్రేమికులు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతున్నారు. ఆదివారం కావడంతో వేల సంఖ్యలో ప్రజలు వాటర్ఫాల్స్ వద్దకు వచ్చినట్టు తెలిసింది.