సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ)/ మణికొండ/ చాదర్ఘాట్: గతకొద్ది రోజులుగా కురుస్తున్న వానలతో నగర శివారులోని జంట జలాశయాలకు జలకళ వచ్చింది. ఇప్పటికే హిమాయత్సాగర్లో నీటిమట్టం గరిష్టస్థాయికి చేరడంతో రెండు రోజుల క్రితమే మూడు గేట్లను ఒకఫీటు ఎత్తువరకు ఎత్తి నీటిని దిగువన ఈసీ నది ద్వారా మూసీలోకి వదులుతున్న అధికారులు గురువారం మరో రెండు గేట్లను ఎత్తారు.ఉస్మాన్సాగర్ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వానలతో ప్రస్తుతం 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతున్నదని అధికారులు తెలిపారు. ఉస్మాన్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 (3.90 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 1784.90 (2.817 టీఎంసీలు) వరకు నీటిమట్టం చేరింది. సీఎం కేసీఆర్ ఆదేశాలమేరకు వాటర్బోర్డు జీఎం రామకృష్ణ, డీజీఎం నరహరి ఆధ్వర్యంలో రెండు గేట్లను ఒక ఫీటు వరకు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అలాగే హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 (2.97 టీఎంసీలు) అడుగులు కాగా, ప్రస్తుతం 1762.65 (2.725 టీఎంసీలు) అడుగుల వరకు నీరు ఉందని, ఐదు గేట్ల ద్వారా 1,030 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతుండగా, సుమారు 400 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతుందని, రాత్రి వరకు ఇది పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. వరద పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తుతామని అధికారులు తెలిపారు.