సిటీబ్యూరో, సెప్టెంబరు 28(నమస్తే తెలంగాణ): గత రెండు మూడు రోజులుగా మహా నగరం పరధిలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్లోకి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో జలమండలి అధికారులు ప్రాజెక్టుల గేట్లు ఎత్తి నీటిని దిగువ మూసీలోకి వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం పెరగడంతో హియాయత్సాగర్ నుంచి ఉదయం 8 గంటలకు రెండు గేట్లను, మరో గంటకు రెండు గేట్లను, ఇలా మొత్తం 10 గేట్ల ద్వారా రెండడుగుల పైకి గేట్లను ఎత్తి దిగువనున్న మూసీ నదిలోకి ఆ నీటిని వదిలారు. హిమాయత్సాగర్ నుంచి 7700 క్యూసెక్కుల నీరు మూసీలోకి వదులుతున్నారు.
ఇక ఉస్మాన్సాగర్ నుంచి ఆరు గేట్లు మూడు అడుగుల మేర పైకి ఎత్తి కిందకు 2,100 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ముందు జాగ్రత్తగా మూసీనది లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఈ సందర్భంగా ఎండీ దాన కిశోర్ తెలిపారు. బోర్డు సిబ్బంది మూసీ నదికి ఇరువైపులా ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని, ప్రజలెవరూ అటువైపుగా వెళ్లొదని విజ్ఞప్తి చేశారు. రాబోయే మరో రెండు రోజుల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపిన సందర్భంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లను అధికార యంత్రాంగంతో పాటు జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులను ఆదేశించారు.