హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ (గండిపేట)లు నీటితో కళకళలాడుతున్నాయి. వారంపదిరోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో వరద పోటెత్తి నిండుకుండల్లా మారాయి. సాధారణంగా వానకాలం ప్రారంభమైన రెండునెలలకు పూర్తిగా నిండేవి. ఈసారి ముందే భారీ వానలు వస్తుండడంతో ఆషాఢంలోనేరెండు చెరువులు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నాయి. హిమాయత్సాగర్ పూర్తిగా నిండడంతో ఏ క్షణమైనా గేట్లు తెరిచే అవకాశముంది. దీంతో ఈసీ, మూసీ పరీవాహక ప్రాంతాల వారిని అధికారులు అప్రమత్తం చేశారు. ఉస్మాన్సాగర్ పూర్తిగా నిండేందుకు మరో 5 అడుగుల దూరంలో ఉంది.
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఆదివారం గ్రేటర్వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఒకట్రెండు రోజులు తెరిపిచ్చినా మళ్లీ కుండపోతతో పలు ప్రాంతాలు నీటమునిగాయి. అత్యధికంగా
పాతబస్తీ బహుదూర్పురాలో 5 సెం.మీలు, అత్యల్పంగా తిరుమలగిరి, కాకతీయహిల్స్లలో 1 సెం.మీ వర్షపాతం నమోదైంది. రాగల మూడురోజులపాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు తెలిపారు.
వర్షాకాలం ఆరంభంలోనే నగర శివారులోని హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ జంట జలాశయాలు నిండు కుండలా మారాయి. గతంలో ఎన్నడూలేని విధంగా తొలకరి ఆరంభంలోనే కురిసిన భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. వరద నీటి ప్రవాహం ఇలానే కొనసాగితే.. ఏ క్షణమైనా హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తి ఈసీ నది ద్వారా మూసీ నదిలోకి నీటిని వదిలేందుకు జలమండలి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఈసీ నది తీర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.
వర్షాకాలం ఆరంభంలోనే వానలు దంచికొడుతుండటంతో జంట జలాశయాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతున్నది. హిమాయత్సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం (ఫుల్ ట్యాంకు లెవల్) 1763.50 అడుగులు (2.97 టీఎంసీలు) కాగా, ప్రస్తుత నీటి మట్టం (ఫుల్ ట్యాంకు లెవల్) 1762.25 అడుగులకు చేరింది.
ప్రస్తుతం 1388 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతున్నది. వరదనీటి ప్రవాహం ఇలానే కొనసాగితే.. మిగిలిన 1.25 ఫీట్ల నీటిమట్టం కూడా అర్ధరాత్రి వరకు చేరే అవకాశం ఉందని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. అయితే మునుపెన్నడూ లేని విధంగా జూలై నెల రెండవ వారంలోనే హిమాయత్సాగర్లో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతుండటంతో పూర్తిస్థాయి నీటిమట్టం రాగానే గేట్లు ఎత్తే అవకాశం ఉన్నది. ఈ నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంతాలు, బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని ఈసీ నది తీర ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ప్రజలందరూ సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించినట్లు కమిషనర్ వేణుగోపాల్రెడ్డి ‘నమస్తే తెలంగాణ’కు తెలిపారు. గత ఏడాది కూడా భారీ వర్షాల కారణంగా అక్టోబర్లో 13 గేట్ల ద్వారా నీటిని వదిలిన విషయం విదితమే.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వరద కాలువలను క్లియర్ చేయడంతో పాటు సమీప ప్రాంతాలను క్లీన్ అండ్ గ్రీన్గా మార్చింది. ఆక్రమణలకు అవకాశం లేకుండా.. ఎఫ్టీఎల్ను నిర్ధారించి సంరక్షించడంతో పాటు జంట జలాశయాలను స్టోరేజీ రిజర్వాయర్లుగా మార్చారు. గతంలో గండిపేట, హిమాయత్సాగర్ల నుంచి ఓల్డ్సిటీకి నీటి సరఫరా చేసేవారు. ప్రస్తుతం వీటిని స్టోరేజీ రిజర్వాయర్లుగా మార్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా కృష్ణానీటిని సరఫరా చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ ఎగువ ప్రాంతంలో జంట జలాశయాలు ఉండటం కారణంగా నగరంలో భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా వృద్ధి చెందడంతో పాటు అత్యవసర సమయంలో నగర ప్రజల తాగునీటికి హిమాయత్సాగర్, ఉస్మాన్సాగర్ రూపంలో ఓ భరోసా దొరికిందని చెప్పవచ్చు. అలాగే ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా వానకాలం ప్రారంభంలోనే హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకోవడం ఇదే మొదటిసారని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ 24/7 అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మాన్సూన్ ఎమర్జెన్సీ, డీఆర్ఎఫ్ సిబ్బందితో వెనువెంటనే సమస్యలను పరిష్కరిస్తున్నది. ఆదివారం సాయంత్రం 5 నుంచి రాత్రి 8గంటల వరకు 58ఫిర్యాదులు అందగా, అందులో 32 ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించారు. మరో 26 ఫిర్యాదులకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే పనిలో జీహెచ్ఎంసీ సిబ్బంది నిమగ్నమయ్యారు.
పరీవాహక ప్రాంతం 505 చదరపు మైళ్లు
వాస్తవ సామర్థ్యం 1763.50 అడుగులు(2.97 టీఎంసీలు)
ప్రస్తుత సామర్థ్యం 1762.25 అడుగులు
ప్రస్తుత ఇన్ఫ్లో 1388 క్యూసెక్లు
ఇన్ఫ్లో ఛానెల్ వెంకటాపూర్ మొయిన్ రివర్ కోర్సు, దిండి సుల్తాన్పల్లి, అమ్థాపూర్
తొలుత 1981, 1982, 1983, 1988, 1989, 1990, 1991, 1998, 2001, 2010 తరువాత సరిగ్గా పదేండ్ల తర్వాత మళ్లీ 2021లో గేట్లు ఎత్తారు. ఈ సంవత్సరం జూలై నెలలోనే గేట్లు ఎత్తి ఈసీ నది ద్వారా మూసీ నదిలోకి వదిలేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
పరీవాహక ప్రాంతం 246 చదరపు మైళ్లు ( 637 చ.కి.)
గరిష్ఠ స్థాయి నీటి మట్టం 1790.00 అడుగులు (3.90 టీఎంసీలు)
ప్రస్తుతం 1784.60 అడుగులు
చెక్ డ్యాం వికారాబాద్ సాకరవాగు, ఎర్రగూడ విలేజ్
రెయిన్ ఫాల్ గేజ్ బుల్కాపూర్, జువ్వాడ, ఉస్మాన్సాగర్
గరిష్ఠ స్థాయి నీటి మట్టం 1790 అడుగులు (దాటితే గేట్లు ఎత్తివేత)
1981, 1983, 1988, 1989, 1990, 1996, 1998, 2000, 2010 తరువాత 2020లో గేట్లు ఎత్తారు. ప్రస్తుతం 1784.60 అడుగుల మేర నీరు ఉండగా, ఇన్ఫ్లో ఆగిందని జలమండలి అధికారులు పేర్కొంటున్నారు. అయితే మరో 5.4అడుగులకు చేరితే గేట్లు ఎత్తుతామని, మరోభారీ వాన పడితే సులభంగానే ఉస్మాన్సాగర్లో నీరు గరిష్ఠస్థాయికి చేరుకుంటుందని అధికారులు పేర్కొంటున్నారు.