సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలు ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్లోకి వరద నీరు వచ్చి చేరుతున్నది. ఈ నేపథ్యంలో రిజర్వాయర్ల గేట్లను ఎత్తివేసి దిగువ మూసీలోకి అధికారులు నీటిని వదులుతున్నారు. ఉస్మాన్సాగర్ గరిష్ఠ స్థాయి నీటి మట్టం 1790.00 అడుగులు కాగా, శుక్రవారం నాటికి 1789.85 అడుగులకు చేరింది. ఎగువ నుంచి రిజర్వాయర్లోకి 350 క్యూసెక్కుల నీరు వస్తున్నదని అంచనా వేసిన అధికారులు.. రెండు గేట్లు ఎత్తి 240 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అలాగే హిమాయత్సాగర్ గరిష్ఠ స్థాయి నీటి మట్టం 1763.50 అడుగులు కాగా, 1763.35 అడుగులకు చేరి నిండుకుండలా మారింది. ఈ రిజర్వాయర్లోకి ఎగువ నుంచి 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండటంతో ఒక గేటును ఎత్తి 350 క్యూసెక్కుల నీటిని మూసీలోకి వదులుతున్నారు. వరద నీటిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ అందుకు అనుగుణంగా నీటిని వదులుతున్నామని, మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని అధికారులు పేర్కొన్నారు.