కరోనా సోకినవారిలో 99శాతం మంది కోలుకొంటున్నారని, 85 శాతానికి పైగా సాధారణ చికిత్సతోనే కోలుకొంటున్నారని స్టార్ హాస్పిటల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ గూడపాటి రమేశ్ పేర్కొన్నారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్నవారిలోనే వైరస్ తీవ్రత అధికంగా కనిపిస్తున్నదన్నారు. కరోనా బాధితుల్లో పానిక్ అటాక్ వల్ల మరణాల్లేవని, అటువంటి సంఘటనలు చాలా అరుదుగా నమోదవుతాయని చెప్పారు. వైరస్ సోకినవారిలో వ్యాధి తీవ్రత పెరగటం, మరణానికి దారితీసే పరిస్థితులకు గల కారణాలపై ఆయన నమస్తే తెలంగాణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
కరోనా పానిక్ అటాక్ మరణాలకు దారితీస్తుందా?
కరోనా విషయంలో భయం వద్దు కానీ, జాగ్రత్తపడాలి. వైరస్ సోకిన వంద మందిలో 99 మంది కోలుకొంటున్నారు. పానిక్ ఎటాక్ కారణంగా మరణాల్లేవు. అంతకుముందే గుండె సంబంధిత సమస్యలు ఉండి.. తీవ్ర ఆందోళనకు గురైన వారిలోనే మరణాలున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారికి తప్ప ఇతరులకు కరోనా ఇలా వచ్చి అలా.. వెళ్లిపోతున్నది. మన శరీరంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు గమనించి, కొవిడ్ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా టెస్ట్ చేయించుకోవాలి. వైద్యుల సూచన మేరకు ఇంట్లో లేదా దవాఖానలో చికిత్స పొందాలి. ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అన్ని వసతులున్నాయి. ఎవరూ పానిక్ కాకూడదు. ఏదేదో ఊహించుకుని వ్యాధిని పెంచుకోవద్దు.
రక్తం గడ్డ కట్టడానికి కారణాలేమిటి?
షుగర్, బీపీ బాధితుల్లో ఎండోపీలల్ డిస్ ఫంక్షన్.. అంటే రక్తనాళాల్లో గోడలకు లైనింగ్ లాంటిది దెబ్బతింటుంది. గుండె సమస్యలున్నవారిలో రక్తనాళాల్లో ప్రసరణకు అంతరాయం ఏర్పడుతుంది. వీరికి కొవిడ్ సోకితే రక్తం గడ్డకట్టడం ఎక్కువగా కనిపిస్తున్నది. దీంతో హార్ట్ ఎటాక్ వచ్చి, మరణానికి దారితీస్తున్నది. కరోనా నుంచి కోలుకొని, ఇంటికొచ్చిన వారిలోనూ హార్ట్ ఎటాక్తో మరణించినవారు ఉన్నారు. కొందరిలో గుండె సమస్యలు లేనప్పటికీ, కరోనా సివియర్ కేసుల్లో రక్తం గడ్డకట్టడం కనిపిస్తున్నది. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నా రక్తం గడ్డ కడుతుంది. అటువంటి సమయంలో హార్ట్ఎటాక్ రావచ్చు. ఊపిరితిత్తుల్లో కూడా రక్తం గడ్డ కట్టుకుపోతుంది. దాన్ని థ్రంబోసిస్ అంటారు. దీనివల్ల గుండె కుడిభాగంలో ఎక్కువ ప్రభావం ఉంటుంది. ఏ అవయవానికి వెళ్లే రక్తనాళంలో రక్తం గడ్డు కట్టుకుపోతుందో ఆ అవయవం పనితీరు దెబ్బతింటుంది. హర్ట్ మజిల్ రక్తం గడ్డకడితే గుండె పనితీరు దెబ్బతింటుంది. బ్లడ్సెల్స్లో రక్తం ప్రవహించేటపుడు క్లాట్ అవదు. అయితే వైరస్ వల్ల.. క్లాటింగ్ అయితే బాడీ మెకానిజం దెబ్బతినే వీలుంది.
కొవిడ్ మరణాలకు ప్రధాన కారణాలేమిటి?
కరోనా మృతుల్లో 65 ఏండ్లకు పైబడినవారు, కోమార్బిడిటీస్ (బీపీ, షుగర్, గుండెజబ్బులు, క్యాన్సర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు) ఉన్నవారే అధికం. వారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉండటం లేదా వ్యాధిని సకాలంలో గుర్తించకపోవడం వంటి కారణాల వల్ల మరణానికి దారితీస్తున్నది. వ్యాధి ముదిరే వరకు గుర్తించలేకపోవడం, ఇతర అనారోగ్య సమస్యలున్న సందర్భాల్లో 30, 40 ఏండ్ల వారు కూడా మరణిస్తున్నారు.
కరోనా పేషెంట్లకు హార్ట్ ఎటాక్ ఎందుకు వస్తుంది?
హైపర్టెన్షన్ ఉన్నవారిలో ఎండోపీలల్ డిస్ ఫంక్షన్ ఉంటుంది. వీరు హార్ట్ ఎటాక్ గురయ్యే ప్రమాదం ఉంది. కరోనా బాధితులకు అంతకుముందే గుండె సంబంధిత సమస్యలుంటే.. రక్తనాళాల్లో గడ్డకట్టే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో హార్ట్ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొందరిలో గుండెకు పంపింగ్ తక్కువగా ఉండొచ్చు. వీరికి కొవిడ్ సోకితే పంపింగ్ మరింత తగ్గిపోతుంది. ఇది కూడా మరణానికి దారితీస్తుంది. కొవిడ్తో హార్ట్బీట్ మందగించే అవకాశం ఉంది. ఇది గుండె మీద భారం పెంచుతుంది. దానివల్ల కూడా సమస్యలు రావొచ్చు. అంతకుముందే గుండె సంబంధిత సమస్యలున్నవారికి ఏ ఇన్ఫెక్షన్ సోకినా గుండె ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. దానిపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ కారణాలవల్లే గుండె సంబంధిత సమస్యలు అధికంగా కనబడుతున్నాయి.
కోలున్నవారిలోనూ ఇతర అనారోగ్య సమస్యలు ఎందుకొస్తాయి?
టెస్టులో పాజిటివ్ అని తేలితే.. వ్యాధి లక్షణాలు కనబడినరోజు నుంచి లెక్కిస్తాం. స్టెరాయిడ్స్ మొదటి 5 రోజుల్లో వాడొద్దు. రెండోవారంలో ఇమ్యునల్ సమస్యలు తలెత్తితేనే వాడాలి. రోగికి అవసరం లేకుండా ముందునుంచే స్టెరాయిడ్స్ వాడటం వల్ల కోలుకున్న తర్వాత ఇతర అనారోగ్య సమస్యలొస్తున్నాయి. చాలామందిలో షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయి. యూరిన్ ఇన్ఫెక్షన్, లంగ్ ఇన్ఫెక్షన్, ఫంగల్ ఇన్ఫెక్షన్, బ్లడ్లో ఇన్ఫెక్షన్తోపాటు ఇమ్యూనిటీ లెవల్ తగ్గడం వంటివి కనబడుతున్నాయి. స్టెరాయిడ్స్ వాడటం వల్లే ఇలాంటి సమస్యలొస్తున్నాయి. చాలామందిలో శారీరక బలహీనత, ఇమ్యూనిటీ లెవల్ తగ్గడం కనబడుతున్నది.
కరోనా సెకండ్ వేవ్ ఎలా ఉంది.. ప్రమాదాలను విశ్లేషిస్తారా?
మొదటిదశ, సెకండ్ వేవ్ లక్షణాలకు చాలా తేడా ఉన్నది. మొదటి దశలో పిల్లలు, మహిళలు తక్కువగా ప్రభావితమయ్యారు. రెండోదశలో పిల్ల లు, మహిళలు, యువకులు అధికంగా ఉంటున్నా రు. క్రిటికల్ దశకు చేరుకున్నవారిలో మరణాల శా తం కూడా పెరిగింది. రోగుల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఈ అంశాలు వైద్యరంగాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. వైద్యసేవల్లో ఎటువంటి మార్పు లేదు. దీర్ఘకాలిక వ్యాధులున్నవారు, వృద్ధులు, వ్యాధి తీవ్రత పెరిగి ఆలస్యంగా వచ్చినవారు తప్ప.. ముం దుగా గుర్తించి, ఇతర జబ్బులు లేని మధ్య వయస్కులు, పిల్లలు వేగంగా రికవరీ అవుతున్నారు.
రోగ నిరోధకశక్తిని గుర్తించటం ఎలా?
మనిషి శరీరంలోకి బయటి నుంచి ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే.. దాన్ని ఎదుర్కొనడాన్నే రోగనిరోధకశక్తి అంటారు. ఇది తక్కువగా ఉన్న వారికి వైరస్ సోకితే.. ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతుంది. కేవలం కరోనా వైరస్ సోకిన వారిలోనే కాకుండా ఇతర వైరస్లు సోకిన వారిలోనూ రోగనిరోధక శక్తి తగ్గుతుంది. దీనిని గుర్తించేందుకు.. ఐఎల్ 6, సీఆర్పీ.. వంటి టెస్ట్లుచేస్తాం.. ఐఎల్ 6 బాడీలో ఇమ్యూనిటీని గుర్తిస్తుంది. దీని ప్రకారం 80-100 కంటే ఇమ్యూనిటీ ఎక్కువుంటే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల కొవిడ్ ఇన్ఫెక్షన్ ఒక్కటే కాదు.. శరీరంలో ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా అది పెరిగే అవకాశం ఉంటుంది. శరీరంలో సాధారణ స్థాయిలో రోగనిరోధకశక్తి ఉండటం మంచిది. అది తక్కువ ఉన్నా, ఎక్కువ ఉన్నా ఇబ్బందే. అవసరానికి మించి ఇమ్యూనిటీ వ్యవస్థ ఎక్కువగా రియాక్ట్ అయితే వ్యాధి తీవ్రత పెరుగుతుంది. మనిషిలో దీనిని గుర్తించడం కూడా సాధ్యం కాదు. ఇమ్యూనిటీ వ్యవస్థ అతిగా స్పందించడం వల్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు మీరిచ్చే సూచనలు..?
కరోనా సోకినవారిలో 99 శాతం మంది కోలుకుంటున్నారు. వైరస్ గురించి భయపడటం కంటే జాగ్రత్తలు పాటించడం ముఖ్యం. మనం తీసుకొనే ఆహారంలో సరైన పోషకాలు ఉండాలి. మంచి డైట్తోపాటు వ్యాయామం చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది. అనవసరంగా స్ట్రెస్కు గురికాకూడదు. స్మోకింగ్, డ్రింకింగ్కు దూరంగా ఉండాలి. పొగపీల్చేవారిలో కూడా ఎయిర్వేవ్స్లో ఉండే ప్రొటెక్టివ్ మెకానిజం బలహీనంగా ఉంటుంది. ఊపిరితిత్తుల లైనింగ్ బలహీనంగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది. స్మోకర్లలో ఇన్ఫెక్షన్ను తట్టుకునే అవకాశం తక్కువగా ఉండటం వల్ల ప్రమాదానికి దారితీస్తుంది.