హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ) : కూడళ్ల వద్ద, రోడ్ల పక్కన, ఫుట్పాత్లపై నాయకుల విగ్రహాలను అనధికారికంగా ఏర్పాటు చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఎందుకు అమలు చేయడం లేదని అధికారులను ప్రశ్నించింది. ఇష్టానుసారంగా విగ్రహాల ఏర్పాటుతో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయని పేరొంటూ 2010లో హైదరాబాద్కు చెందిన ఎంఏకే ముఖీద్ ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్సేన్ రెడ్డిల ధర్మాసనం ఇటీవల మరోసారి విచారణ చేపట్టింది. అనధికార విగ్రహాలను తొలగించాలని 2018లోనే ప్రభుత్వం జీవో జారీ చేసిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సంజీవ్కుమార్ చెప్పారు.
దీనిపై స్పందించిన హైకోర్టు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాల తర్వాత విగ్రహాల ఏర్పాటు జరుగలేదా.., ఇప్పటి వరకు ఎన్ని విగ్రహాలను అధికారులు తొలగించారు, ప్రభుత్వం జీవో జారీ తర్వాత ఎన్ని విగ్రహాలను అనధికారికంగా ఏర్పాటు చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2010 నాటి పిల్ పై విచారణ మూసేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఇదే అంశంపై సుమోటోగా విచారణ కొనసాగిస్తామని, ఇందులో భాగంగానే పురపాలక, రోడ్లుభవనాల శాఖల ముఖ్య కార్యదర్శులు, జీహెచ్ఎంసీ కమిషనర్లను ప్రతివాదులుగా చేసి నోటీసులు జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. తదుపరి విచారణను సెప్టెంబర్ 17కు వాయిదా వేసింది.