హైదరాబాద్, జూన్ 10 (నమస్తే తెలంగాణ): గోలొండ, కుతుత్ షాహి టూంబ్స్ ఇతర చారిత్రక కట్టడాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించి సర్వే చేయాలని హైకోర్టు ఆదేశించింది. గతంలో హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటైన కమిటీ, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసిన ఆ టూంబ్స్ సహా 27 చారిత్రక కట్టడాల పరిస్థితులపై సర్వే చేయాలని, పరిషారమార్గాలు కూడా నివేదించాలని కోర్టు చెప్పింది.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమాకోహ్లీ, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. గోలొండ కోట మట్టి గోడలు వర్షాలకు కరిపోయాయని, రాళ్లు పడిపోయాయని, శిథిలావస్థకు చేరే దుస్థితిలో ఉందని, కేంద్ర, రాష్ట్ర పురావస్తు శాఖలు చర్యలు తీసుకోవడం లేదని పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు ప్రజాహిత వ్యాజ్యంగా పరిగణించింది.
హైకోర్టు ఆదేశాల తర్వాత ఏప్రిల్ 19న కమిటీ ఏర్పాటు జరిగిందని, మే నెలలో ప్రణాళిక రూపొందించిందని, 6నెలలు గడువు ఇస్తే చర్యలపై నివేదిక అందజేస్తామని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది హరేందర్ పరిషద్ చెప్పారు. 6వారాల్లోనే నివేదిక ఇవ్వాలని హైకోర్టు కోరింది. ఇదిలా ఉండగా, కుతుబ్ షాహి టూంబ్స్ వక్ఫ్ బోర్డుకు చెందినవని, దీనిపై సివిల్ కోర్టులో కేసు నడుస్తున్నని, ఈ పిల్ లో తనను ప్రతివాదిగా చేయాలని ప్రైవేట్ వ్యక్తి చేసిన వినతిని హైకోర్టు తోసిపుచ్చింది. పిల్పై విచారణను జులై 28కి వాయిదా వేసింది.