హైదరాబాద్, నమస్తే తెలంగాణ : ఇంజక్షన్ ఆర్డర్ పొంది అటు కోర్టులను, ఇటు అధికారులను తప్పుదోవ పట్టించడం అక్రమ నిర్మాణదారులకు పరిపాటిగా మారింది. దీన్ని గుర్తించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చల్లా కోదండరాం అక్రమ నిర్మాణాల తొలి దశలో జీహెచ్ఎంసీ నోటీసులను కింది కోర్టులో సవాల్ చేసి ఇంజక్షన్ (స్టే) ఆర్డర్ పొంది, ఆ తర్వాత నిర్మాణాలు పూర్తి చేయడాన్ని తీవ్రంగా పరిగణించాలని ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. ఇందుకు కోర్టు ఉత్తర్వూలే దోహదపడుతున్నాయనే భావన ప్రజల్లో ఏర్పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు.
నింబోలిఅడ్డాలో ఓంప్రకాశ్, సురేశ్లు అనుమతి పొందిన దాని కంటే రెండంతస్తులు ఎకువ నిర్మాణం చేపడుతున్నట్లు అందిన ఫిర్యాదు మేరకు జీహెచ్ఎంసీ వారికి 2017లో నోటీసులు జారీ చేసింది. దీనిపై వారు కింది కోర్టు నుంచి ఇంజక్షన్ ఆర్డర్ పొందారు. జీహెచ్ఎంసీ కౌంటర్ దాఖలు చేసింది. కేసు విచారణకు పిటిషనర్లు ఓంప్రకాశ్, సురేశ్ కోర్టుకు హాజరుకాకపోవడంతో కేసును కొట్టేసింది. దీంతో జీహెచ్ఎంసీ కౌంటర్లో పేర్కొన్న అంశాలపై న్యాయమూర్తి విస్తుపోయారు. కోర్టు నుంచి స్టే ఆర్డర్ పొంది ఆపై అక్రమ నిర్మాణాలు పూర్తి చేయడం, తీరా కేసు విచారణకు వచ్చే సమయానికి కేసును ఉపసంహరించుకోవడం లేక కేసు విచారణకు హాజరుకాకపోవడం పిటిషనర్లు చేస్తున్నారని గుర్తించారు.
ఇదే తరహాలో జీహెచ్ఎంసీ సరిల్-16లో గత ఐదేండ్ల కాలంలో కింది కోర్టుల నుంచి అక్రమ నిర్మాణాలపై 189 పిటీషన్లు దాఖలయ్యాయని రికార్డులను పరిశీలించిన తర్వాత తేల్చారు. వీటిలో అత్యధిక శాతం ఉపసంహరణ లేక విచారణకు హాజరుకాకపోవడమే జరిగినట్లుగా న్యాయమూర్తి గుర్తించారు. ఒక సరిల్లోనే 189 కేసులు ఉంటే 30 సరిళ్లలో వాటి సంఖ్య ఎంత ఉంటుందో తేల్చాల్సిన అవసరం ఉందన్నారు. అందుకే ఈ వివరాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసిన వైనానికి సంబంధించిన ఈ కేసు ఫైల్ను ప్రధాన న్యాయమూర్తికి నివేదించాలని హైకోర్టు రిజిస్ట్రీని ఆదేశిస్తున్నట్లు న్యాయమూర్తి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.