సిటీబ్యూరో/చార్మినార్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): ఎన్నో ఘనమైన చారిత్రక వారసత్వ కట్టడాలకు హైదరాబాద్ నెలవు. ఎన్నో ఏండ్ల చరిత్ర గల పురాతన కట్టడాలను భావితరాలకు అందించడం బాధ్యతగా భావించిన సర్కార్ చారిత్రక వారసత్వ సంపదను పునరుద్ధరించి పూర్వ వైభవం తీసుకువస్తున్నది. ప్రముఖ వారసత్వ కట్టడాల్లో మొజంజాహి మార్కెట్, ఐకానిక్ ప్రాజెక్టుగా చార్మినార్ను అందం గా పునరుద్ధరించింది. ఇందులో భాగంగానే రూ.84 లక్షలతో చార్మినార్లోని చార్ కమాన్లో భాగమైన కాలికమాన్ను పునరుద్ధరించి చూడముచ్చటగా ముస్తాబు చేశారు. కాలికమాన్ నిర్మాణాన్ని చేపట్టిన సమయంలో ఉపయోగించిన గచ్చుతోనే కాలికమాన్ మరమ్మతులు చేశారు. 430 సంవత్సరాల కిందట నిర్మించిన చారిత్రక కట్టడాల కోసం వినియోగించిన టెక్నాలజీని మరో మారు కాలి కమాన్ పునరుద్ధరణ కోసం అధికారులు వినియోగించడం గమనార్హం.
చార్మినార్ సమీపంలోని నీటి ఫౌంటేన్కు తూర్పున నిర్మించిన మరో చారిత్రక కట్టడమే కాలి కమాన్. చారిత్రక కట్టడమైన చార్మినార్ నిర్మిస్తున్న సమయంలోనే కాలి కమాన్ నిర్మాణాన్ని చేపట్టారు. కాలక్రమంలో కాలికమాన్ చుట్టూ అక్రమ నిర్మాణాలు వెలువడంతో దాని ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. కాలికమాన్ చరిత్ర భావితరాలకు అందించాలని నిర్ణయించిన మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అర్వింద్కుమార్ కాలికమాన్ను అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకున్నారు. సుమారు 430 సంవత్సరాల కిందట నిర్మించిన కాలి కమాన్ ఆదరణకు నోచుకోకపోవడంతో పెచ్చులూడుతూ ప్రమాదకర స్థాయికి చేరుకుంది. అర్వింద్కుమార్ అభివృద్ధికి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ కమాన్ చుట్టూ నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించి భావితరాలకు చారిత్రక ప్రాధాన్యత కలిగిన కాలికమాన్ అందించేందుకు కృషి చేస్తున్నారు.
ప్రస్తుతం కాలికమాన్ నిర్మాణంలో వినియోగిస్తున్న విధానాన్ని గచ్చుగా పిలుస్తుంటారు. గచ్చును తయారు చేసి వినియోగించడానికి వారం రోజుల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. తయారీకి డంగు సున్నం, కరక్కాయ, బెల్లం, జనపనార, ఇసుక, కరీంనగర్ ఇటుకలు, గుడ్డులోని తెల్లసొనను ఉపయోగించారు.