మీ కుటుంబ సభ్యులు సర్కారు దవాఖానలో కొవిడ్ చికిత్స పొందుతున్నారా? వారు ఎలా ఉన్నారోనన్న దిగులొద్దు. ఒక్క ఫోన్ కొట్టండి చాలు. మన పోలీసులు వెంటనే క్షేమ సమాచారం అందిస్తున్నారు. కొవిడ్ బాధితుల కుటుంబ సభ్యులకు గుండె ధైర్యమిస్తున్నారు. ఎలాంటి సహాయమైనా చేసేందుకు మేమున్నామంటూ భరోసానిస్తున్నారు. వైద్యవిభాగంతో సమన్వయం చేసుకుంటూ.. ప్రధాన వైద్యశాలలు, కమిషనర్ కార్యాలయాల్లో ప్రత్యేకంగా హెల్ప్డెస్క్లను ఏర్పాటు చేస్తున్నారు. 24 గంటలూ సేవలందిస్తున్నారు. ఎవరైనా ఈ కేంద్రాల్లో సంప్రదిస్తే చాలు.. అక్కడి సిబ్బంది అవసరమైన సమాచారం ఇస్తున్నారు. రోగుల వివరాలు, పడకల సంఖ్య, ఆక్సిజన్ సౌలభ్యత, వెంటిలేటర్ వసతులు.. ఇలా అన్ని వివరాలు తెలియజేస్తున్నారు. చికిత్స పొందుతున్న తమ వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు కుటుంబసభ్యులు ఈ సహాయ కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారు. కాగా, నిమ్స్ దవాఖానలో సోమవారం సీపీ అంజనీకుమార్ హెల్ప్డెస్క్ను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే ఆక్సిజన్ వాహనాలకు జీపీఎస్ వ్యవస్థను వినియోగిస్తున్నామని, త్వరగా గమ్యం చేరేలా గ్రీన్ చానెల్ను ఏర్పాటు చేశామని తెలిపారు.
ఓ వైపు కరోనాను కట్టడి చేస్తూ.. మరోవైపు కరోనా బాధితులకు సేవలందించడంలో హైదరాబాద్ పోలీసులు ముందు వరుసలో ఉన్నారు. జీహెచ్ఎంసీ, వైద్యశాఖతో సమన్వయం చేసుకుంటూ ఎప్పటికప్పుడు వారికి కావాల్సిన సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు. మరోవైపు గాంధీ, కింగ్కోఠి, నిమ్స్లో ఆయా వైద్య విభాగాలతో కలిసి సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదటగా గాంధీలో హెల్ప్లైన్ను ఏర్పాటు చేసిన పోలీస్ శాఖ ఆ తర్వాత మిగిలిన అన్ని వైద్యశాలలకు విస్తరించింది. కరోనాతో చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ వారి బంధువులకు తెలియజేయడంలో ఈ సహాయ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. అంతేకాక ఈ కేంద్రాల ద్వారా ఆయా వైద్యశాలల్లో చికిత్స పొందుతున్న రోగులు, పడకలు, వెంటిలేటర్లు, ఆక్సిజన్ సిలిండర్ల వివరాలు తెలుసుకోవడం సులభంగా మారింది. నగరవాసులకు కావాల్సిన సహాయం చేయడంపై నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ సిబ్బందికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.
ప్రభుత్వ శాఖల సమన్వయంతో సిటీ పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హెల్ప్డెస్క్లు బెడ్ మేనేజ్మెంట్ సిస్టం, జీహెచ్ఎంసీ అంబులెన్స్ బుకింగ్ విధానం, ఆక్సిజన్ సరఫరా వివరాలు, కొవిడ్తో మరణించిన వారి వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేస్తున్నాయి. అంతేకాక కేవలం ప్రభుత్వ వైద్యశాలల సమాచారమే కాక ఇతర ప్రైవేట్ వైద్యశాలలకు సంబంధించిన వివరాలను ఫోన్ చేసిన వారికి అధికారులు అందించే ప్రయత్నం చేస్తున్నారు.
అన్ని ప్రభుత్వ విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ప్రజలకు కావాల్సిన సమాచారాన్ని అందించేందుకు పోలీసు శాఖ నిరంతరం శ్రమిస్తున్నది. ప్రధాన వైద్యశాలల్లో ఇప్పటికే హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం. మరిన్ని దవాఖానాల్లోనూ వీటి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నాం. లైజనింగ్ అధికారుల ద్వారా దవాఖానలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి ప్రజలకు తెలియజేస్తున్నాం. వైద్యాధికారులు, జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకుంటున్నాం. నగర పోలీసుల తరుపున వైద్యులు, వైద్య బృందానికి వందనం చేస్తున్నా. కొవిడ్పై కొందరు పుట్టిస్తున్న పుకార్లను నమ్మవద్దు. ఏ సమాచారం కావాలన్నా హెల్ప్డెస్క్లకు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.