హెల్మెట్… ప్రయాణంలో మనకు రక్షణ కవచం. ప్రమాదం నుంచి బయటపడాలంటే దీనిని తలకు ధరించాలి. కానీ కొందరు వాహనదారులు అశ్రద్ధగా ఉంటున్నారు. చలాన్ల నుంచి తప్పించుకునేందుకు వెంట తీసుకెళ్తున్నా.. సక్రమంగా ధరించడం లేదు. పోలీసులు కనిపించగానే పెట్టుకుని…ముందుకు వెళ్లగానే బండికి తగిలిస్తున్నారు. మరికొందరు పెట్రోల్ ట్యాంక్పై పెట్టుకుని ప్రమాదకరంగా ప్రయాణిస్తున్నారు. ఇంకొందరు వెనుక కూర్చున్నవారికి ఇచ్చేస్తున్నారు. వెనుక కూర్చున్న వారైనా తలకు ధరిస్తున్నారా..? అంటే అదీ లేదు. ఇలా చిన్నపాటి నిర్లక్ష్యానికి భారీ మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. హెల్మెట్ లేకుంటే… కొన్ని సందర్భాల్లో నిండు జీవితాన్నే కోల్పోవాల్సి వస్తుంది.
ఒకప్పుడు సైకిలే సామాన్యుడి వాహనం. కానీ ఇప్పుడు ఆ స్థానాన్ని ద్విచక్రవాహనాలు ఆక్రమించాయి. ప్రతి ఇంట్లోనూ కనీసం ఒక బైక్ ఉంటుంది. అవసరాన్ని బట్టి ఒకటి కంటే ఎక్కువ ఉన్నవారూ ఉన్నారు. మహానగరంలో సుమారు కోటికిపైగా జనాభా ఉంటే… దాదాపు 50.42లక్షల ద్విచక్రవాహనాలు ఉంటాయని ఒక అంచనా. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరికి ద్విచక్రవాహనం ఉన్నది. 2041నాటికి మహానగరంలో జనాభాతో సమానంగా ప్రైవేటు వాహనాల సంఖ్య ఉంటుందని సమగ్ర రవాణా వ్యవస్థపై లీ అసోసియేట్స్ సంస్థ చేసిన అధ్యయనంలో తేలింది.
వాహనాల సంఖ్య పెరుగుతున్నట్లుగానే రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా పెరుగుతుంది. రోడ్డు ప్రమాదాలను సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్షుణ్ణంగా విశ్లేషించారు. గతేడాది నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు పరిశీలిస్తే… ఇందులో హెల్మెట్ లేకుండా చనిపోయిన వారు సుమారు 400 మందిపైగా ఉన్నారు. ఇందులో హెల్మెట్ ఉండి కూడా వాటిని తలకు పెట్టుకోకుండా..బండికి తగిలించుకుని ప్రమాదాల బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 73వరకు ఉంటుందని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. వారంతా సక్రమంగా హెల్మెట్లను ధరించి ఉంటే ప్రాణాలతో ఉండేవారని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
హెల్మెట్లు వెంట పెట్టుకుని ధరించకుండా ప్రమాదాల బారిన పడినవారిలో ప్రాణాలు పోయిన వారే కాకుండా, క్షతగాత్రులు అయిన వారూ ఉన్నారు. ఈ క్షతగాత్రుల అవస్థలు వర్ణణాతీతం. ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన కుటుంబాలు ఎన్నో. ప్రమాదంలో గాయపడిన వారి చికిత్స కోసం ఆస్తులను అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడుతున్నది. మరికొందరు తలకు గాయాలై కోమాలోకి వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే జరిగే అనర్థాలపై సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఇకపై హెల్మెట్ తప్పకుండా ధరిస్తామని ద్విచక్రవాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు హామీ ఇస్తున్నారు.